దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీకి భారీ షాక్ తగలనుంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అలక వహించిన ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు.
సిద్ధిపేట: దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తెలంగాణ కాంగ్రెసు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగులుతోంది. టీఆర్ఎస్ కు దూరమైన తమ పార్టీలో చేరిన చెరుకు శ్రీనివాస రెడ్డికి కాంగ్రెసు పార్టీ దుబ్బాక టికెట్ ఇచ్చింది. దీంతో టికెట్ ఆశించిన దుబ్బాక సీనియర్ నేతలు అలకవహించారు.
కాంగ్రెసు నాయకులు మనోహర్ రావు, నర్సింహా రెడ్డి టీఆర్ఎఎస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు. వారిద్దరు కూడా దుబ్బాక కాంగ్రెసు టికెట్ ఆశించారు. దాంతో కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమక్షంలో వారు టీఆర్ఎస్ లో చేరనున్నారు.
సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మృతితో దుబ్బాకకు ఉప ఎన్నిక జరుగుతోంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే, సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాతను పోటీకి దించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులో చేరారు.
చెరుకు శ్రీనివాస రెడ్డికి వెంటనే కాంగ్రెసు నాయకత్వం దుబ్బాక టికెట్ ఖరారు చేసింది. దీంతో సీనియర్ నేతలు నర్సింహా రెడ్డి, మనోహర్ రావు కాంగ్రెసును వీడేందుకు సిద్ధపడ్డారు
ఇదిలావుంటే, దుబ్బాక నుంచి బిజెపి అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. సుజాత విజయం కోసం హరీష్ రావు తీవ్రంగా కృషి చేస్తున్నారు.