
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయనను సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన రికార్డులు, ఫైల్స్ ను ఈ నెల 13వ తేదీలోపుగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది పలు అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇప్పటికే రెండు దఫాలు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రెండు దఫాల సమయంలో అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ విషయంలో అనుమానాలున్నాయన్నారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ పై సీబీఐ అధికారుుల సంతకాలు తీసుకోలేదన్నారు. అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారి ఈ స్టేట్ మెంట్ ను ఎడిట్ చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు.
అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేశారా అని సీబీఐ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ఆడియో, వీడియో రికార్డ్ చేసినట్టుగా సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు. మరోవైపు.. అవినాష్ రెడ్డి పిటిషన్పై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ అయింది.
ఇదిలావుండగా.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారంనాడు సీబీఐ విచారణకు హాజరయ్యారు.హైద్రాబాద్ కోఠిలో గల సీబీఐ కార్యాలయానికి వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు.