హుజురాబాద్ ఉపఎన్నిక, యుద్ధానికి ముందే చేతులెత్తేస్తారా.. రాహుల్, ప్రియాంకలకు అన్ని చెబుతా: కోమటిరెడ్డి

By Siva KodatiFirst Published Sep 25, 2021, 4:02 PM IST
Highlights

టీకాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌‌లో యుద్ధానికి ముందే చేతులెత్తేస్తామా? ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

టీకాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పీసీసీ వచ్చి మూడున్నర నెలలు అయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు రివ్యూ చేయట్లేదని ప్రశ్నించారు. పీసీసీ నేతలు హుజూరాబాద్ ఎందుకు వెళ్లడంలేదని కోమటిరెడ్డి నిలదీశారు. పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు భారీగానే ఓటు బ్యాంకు ఉందని, గత మూడు ఎన్నికల్లో 60 వేల వరకు ఓట్లు వచ్చాయని, అందరం కలిసి పనిచేస్తే మరో 50 వేల ఓట్లు రావా? అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

సీనియర్లను ఇన్‌ఛార్జీలుగా నియమించి, వారానికి ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ గెలవదా? అని ఆయన ప్రశ్నించారు. జీరోగా ఉన్న దుబ్బాకలోనే 23 వేల ఓట్లు తెచ్చుకున్నామని, అలాంటిది హుజూరాబాద్ పోరును కాంగ్రెస్ వదిలేస్తే దానర్థం ఏంటి? అని కోమటిరెడ్డి నిలదీశారు. హుజూరాబాద్‌‌లో యుద్ధానికి ముందే చేతులెత్తేస్తామా? ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Also Read:టీపీసీసీలో వివాదానికి తెర.. అలా మాట్లాడటం తప్పే: రేవంత్‌పై వ్యాఖ్యలకు జగ్గారెడ్డి క్షమాపణలు

ఇలాంటివన్నీ భరించలేకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. తనకు ఇలాంటి షో రాజకీయాలు తెలియవని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే పార్టీ సన్నద్ధమయ్యేది ఇలాగేనా? అని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను నియమిస్తారా అంటూ మండిపడ్డారు. వచ్చేవారం దీనిపై రాహుల్ గాంధీ, ప్రియాంకలను కలిసి ఈ విషయాలు వివరిస్తానని కోమటిరెడ్డి వెల్లడించారు. ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలి, అప్పుడే గెలుస్తుందని వెంకట్ రెడ్డి హితవు పలికారు. 
 

click me!