Bhu Bharati land meetings across Telangana: తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఏప్రిల్ 14న తెలంగాణ సర్కారు ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2 నుండి అన్ని మండలాల్లో భూ భారతి రెవెన్యూ మీటింగ్ లు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాలతో ధరణి పోర్టల్ కారణంగా తలెత్తిన భూ వివాదాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
భూ భారతి పోర్టల్ను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహించారు. ఆపై మే 5 నుండి మే నెలాఖరు వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం (మే 14న) మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మే నెలాఖరుకు 60 శాతం భూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. భూ భారతి చట్టం కింద ఏవైనా సమస్యలు పరిష్కరించలేనిపక్షంలో, బాధితులకు కారణాలను తెలియజేస్తామని చెప్పారు.
సాదా బైనామా (తెలుపు కాగితాలపై భూముల అమ్మకాలు) కేసులు కోర్టులో ఉన్నందున, ఈ రెవెన్యూమీట్లలో పరిష్కరించలేమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మద్దూర్, లింగంపేట, వెంకటాపురం, నీలకొండపల్లి మండలాల్లో భూ భారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. అక్కడ వచ్చిన దరఖాస్తులపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి, తిరస్కరించకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి ఆదేశించారు.
“ఇప్పటినుండి తహసీల్దార్లకు ఆన్లైన్ నమోదు సౌకర్యం కల్పించాం. వచ్చిన దరఖాస్తులపై చర్చ జరిపి మే నెలాఖరులోగా ముఖ్య సమస్యలపై నిర్ణయం తీసుకోవాలి” అని మంత్రి పేర్కొన్నారు. రైతులు న్యాయస్థానాలకు వెళ్లకుండా, రెవెన్యూకార్యాలయాల వద్దే తమ భూసంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.