
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఈ రోజు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, పంట నష్టంపై గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు వినతిపత్రం అందజేశారు. వరద బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ తమిళిసైను కలిసినవారిలో మల్లు రవి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
గవర్నర్ను కలిసిన అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరద నష్టంపై గవర్నర్కు వివరించినట్టుగా చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టం గురించి తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన విపత్తు అయినప్పటికీ.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
ప్రజల కోసం పనిచేయాల్సిన యంత్రాంగాన్ని రాజకీయం కోసం వాడుతున్నారని మండిప్డారు. ఆర్టీసీవి ప్రజల ఆస్తులు అని చెప్పారు. ఆర్టీసీకి అనేక ఆస్తులు సమకూర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మితే చూస్తూ ఊరుకోమని చెప్పారు. రోడ్డు మీదకు వచ్చి ఆస్తులను కాపాడుతామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. డబ్బులు వెచ్చించి వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రత్యేక విమానాల్లో ప్రగతి భవన్కు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వరదల వల్ల తమ నియోజకవర్గాలు ధ్వంసమైనప్పుడు రెస్క్యూ టీమ్లను పంపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, శ్రీధర్బాబు చేసిన అభ్యర్థనను పట్టించుకోలేదని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాథమిక సహాయాన్ని అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.