
వరంగల్: వరంగల్ భద్రకాళీ ఫైర్ వర్క్స్లో బుధవారం నాడు చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రేణుక, మల్లిఖార్జున్, రాకేష్ల ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు. కొత్త బైక్ను కొనుకొన్న మల్లిఖార్జున్ విధులకు హజరైనట్టుగా హజరుపట్టికలో ఉంది. కానీ, ఆయన ఆచూకీ కోసం భార్య, కూతురు ఎదురు చూస్తున్నారు.
బుధవారం నాడు ఉదయం భద్రకాళీ ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో ఐదురుగు పరిస్థితి తీవ్రంగా ఉంది.
ఇవాళ ఉదయం పూట రోజూ మాదిరిగానే మల్లిఖార్జున్ విధులకు హజరయ్యారు. హజరుపట్టికలో మల్లిఖార్జున్ విధులకు హజరైనట్టుగా ఉంది. అగ్ని ప్రమాదం తర్వాత మల్లిఖార్జున్ మృతదేహం లభ్యం కాలేదు.
సంఘటనా స్థలంలో కూడ ఆనవాళ్లు లభ్యం కాలేదని ఆయన భార్య చెప్పారు. ఏంజీఏం ఆసుపత్రికి వచ్చినా మల్లిఖార్జున్ మృతదేహం లేదన్నారు. మల్లిఖార్జున్ ఎక్కడ ఉన్నాడో ఆచూకీని కనిపెట్టాలని ఆమె అధికారులను కోరుతున్నారు.వారం రోజుల క్రితమే కొత్త బైక్ ను మల్లిఖార్జున్ కొనుగోలు చేశారు.ఈ బైక్ ఫ్యాక్టరీ వద్దే ఉంది. కానీ, ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.
రాకేష్ అనే యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన కూడ ఎక్కడకు వెళ్లాడనే ఆందోళన రాకేష్ తల్లిలో కన్పిస్తోంది. సంఘటన స్థలంతో పాటు ఏంజీఎం ఆసుపత్రి వద్ద అధికారులను, పోలీసులను ఆమె అడుగుతోంది.రాకేష్ ,మల్లిఖార్జున్ బంధువులు. మరో వైపు శ్రీదేవి అనే మహిళ ఆచూకీ కూడ లభ్యం కాలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మల్లిఖార్జున్ కు గతంలో ఈ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో తొడకు గాయమైంది. ఇక్కడ పనిని మానేయాలని చెప్పినా కానీ, అతను పని మానేయలేదు. రాకేష్ కు కూడ గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదంలో కాలుకు గాయమైంది. ఏడాది పాటు ఏంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తిరిగి భద్రకాళీ ఫ్యాక్టరీలో చేరారు.