
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల టీమ్పై తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతుంది. షర్మిల మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే షర్మిల టీమ్ అప్రమత్తమైంది.
దీంతో వారు షర్మిలను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో షర్మిల తేనెటీగల దాడి నుండి బయటపడ్డారు. అయితే తేనెటీగల దాడిలో పలువురు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
ఇక, వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 400 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన షర్మిల..
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో కూలీల మృతి ఎంతో కలచివేసిందని వైఎస్ షర్మిల అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు షర్మిల ట్విట్టర్లో పోస్టు చేశారు.