
కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించారంటూ రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంమంత్రి కేసీఆర్ ను కలిపించాలని... పార్టీలో చేరికపై ఆయనతో మాట్లాడాలని స్వయంగా తననే సంజయ్ కోరినట్లు రవీందర్ సింగ్ తెలిపారు. బిఆర్ఎస్ చేరతానని స్వయంగా తనతోనే సంజయ్ అన్నారని కరీంనగర్ మాజీ మేయర్ పేర్కొన్నారు.
గతంలో బిఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నించిన సంజయ్ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను విమర్శించడం తగదని రవీందర్ సింగ్ అన్నారు. ఇకపై నోరుజారితే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పనితీరు, అభివృద్ది, సంక్షేమాన్ని చూసి అవార్డులు అందిస్తుంటూ సంజయ్ మాత్రం విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ది కేంద్రంలోని బిజెపి ప్రభత్వానికి కనిపిస్తోంది కానీ రాష్ట్ర బిజెపి నాయకులకు కనిపించడం లేదని రవీందర్ సింగ్ అన్నారు.
వీడియో
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసే బిఆర్ఎస్ పార్టీపై కుట్రలు పన్నుతున్నాయని రవీందర్ సింగ్ అన్నారు. కర్ణాటకకు వెళ్లి బిజెపి ఓటేయాలని కాకుండా కాంగ్రెస్ కు ఓటేయాలని సంజయ్ అన్నట్లు ఆరోపించారు. బిజెపి నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఉన్నసీట్లు కూడా పోతాయని రవీందర్ సింగ్ హెచ్చరించారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై రవీందర్ సింగ్ ఘాటుగానే స్పందించారు. మొదటినుండి బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తిరుగుబాటు చేసారు. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కూడా చేసారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో వెనక్కితగ్గిన అతడు సముచిత స్థానం కల్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడంతో బిఆర్ఎస్ లోనే కొనసాగారు. ఇచ్చిన హామీ మేరకు రవీందర్ సింగ్ ను సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించారు కేసీఆర్.
తిరిగి బిఆర్ఎస్ లో చేరినప్పటి నుండి రవీందర్ సింగ్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరీముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సంజయ్ బిఆర్ఎస్ చేరడానికి ప్రయత్నించారంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచాయి. నిజంగానే సంజయ్ పార్టీ మారడానికి ప్రయత్నించారా..? రవీందర్ సింగ్ మాటల్లో నిజమెంత? అనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో సాగుతోంది.