
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారీ స్థాయిలో ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టింది కేవలం పోలీసులు శాఖలోనే. కేవలం ఇంటర్ అర్హతగా నిర్ణయించడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యారు. పీజీ, ఎంటెక్ చేసిన వారు సైతం ఇదే బాట పడ్డారు.
సివిల్, ఏఆర్, సీపీఎల్, టీఎ్సఎ్సపీ, ఫైర్ సర్వీస్ విభాగాల్లో 11,281 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు ఇటీవల ఫలితాలు విడుదల చేశారు. తుది ఫలితాల్లో 10,113 మంది ఎంపికయ్యారు.
అయితే కటాఫ్ మార్కులు, రిజర్వేషన్లు ప్రకటించకుండానే తుది ఫలితాలు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారుఎంపికయ్యారని అభ్యర్థులు ఆందోళన చెందారు.
కొందరు డీజీపీ కార్యాలయానికి వచ్చి ధర్నా కూడా చేశారు. అయితే పోలీసులు మాత్రం అక్రమాలు ఏమీ జరగలేదని కటాఫ్, రిజర్వేషన్ తదితరాలను వెబ్ సైట్ లో ఉంచుతామని ప్రకటించారు. అభ్యంతరాలుంటే తమ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయోచ్చని సూచించారు.
అయితే ఈ విధానంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు నియామక ప్రకటన నుంచే సరైన విధానంలో రిక్రూట్ మెంట్ జరగలేదని వారు వాపోతున్నారు.
మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుందని నోటిఫికేషన్ లో ప్రకటించి అధికారులు ఇప్పుడు 10 శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించారని మహిళా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, ఫిజికల్ టెస్ట్ లకు సంబంధించిన నిర్వహించిన పరీక్షలో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా నియమాలు రూపొందించారని దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని మరికొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
494 కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల నియామకం కోసం జనవరి 29వ తేదీన నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో కూడా గందరగోళం నెలకొంది.
ఈ పరీక్షలకు 39,255 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల కులం, వారి ఆదాయాన్ని తెలియజేసేలా క్రీమీలేయర్ (రూ.ఆరు లక్షల లోపు ఆదాయం ఉన్నట్లు) సర్టిఫికెట్కు సంబంధించి అనెక్సర్-3 ఫామ్ను ఇవ్వాలని అధికారులు సూచించారు.
ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల సమయంలో వాటిని సమర్పించాల్సి ఉన్నప్పటికీ చాలామందికి అవగాహన లేకపోవడంతో అప్పుడు ఇవ్వలేకపోయారు. రాత పరీక్ష రాసిన రోజు అనెక్సర్-3 సర్టిఫికెట్ను సమర్పించారు. వాటిని అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేసి కులాల వారీగా విభజించి వారి కటాఫ్ మార్కులను నిర్ణయించారు. ర్యాంకులతో కూడిన మెరిట్ లిస్టును ఈనెల 16న విడుదల చేశారు. మెరిట్ లిస్టులో అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్ను అందించినట్లు చూపించగా.. ఫైనల్ ఫలితాల్లో మాత్రం ఇవ్వనట్లు రావడంతో అత్యధిక మార్కులు వచ్చిన పలువురు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
కానిస్టేబుల్ ఫలితాలు వెలువడిన అనంతరం 1200 పోస్టులను రిక్రూట్ చేయకుండా ఖాళీగా ఎందుకు ఉంచారో ఇంకా అర్థం కావడం లేదు. దీనిపై కూడా అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెబ్ సైట్ ద్వారా కాకుండా స్వయంగా తమ అభ్యర్థులను పోలీసులు రిక్రూట్ మెంట్ అధికారులకు విన్నవించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
కాగా, పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలపై అనుమానాలను వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు తాము అండగా ఉంటామని టీజేఏసీ ప్రకటించింది.
తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులు 27 న మధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని వివరాలతో నాంపల్లి లోని టీజేఏసీ ఆఫీసుకు (మొబైల్ 9849056340) రావొచ్చని సూచించింది.