ఖమ్మంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎంగేజ్‌మెంట్‌కు కొన్ని గంటల ముందు లాడ్జిలో..

By Sumanth KanukulaFirst Published Jan 10, 2022, 2:08 PM IST
Highlights

ఖమ్మం (Khammam) పట్టణంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable suicide) చేసుకున్నాడు. కొద్ది గంటల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. పట్టణంలోని ఒక లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఖమ్మం (Khammam) పట్టణంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable suicide) చేసుకున్నాడు. కొద్ది గంటల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. పట్టణంలోని ఒక లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాలు.. ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురంకు చెందిన అశోక్‌ కుమార్ 2020లో పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్‌గా నియమితుడయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధుల్లో చేరారు. పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లాకు అశోక్‌ కుమార్ బదిలీ అయ్యారు.

నిన్న రాత్రి ములుగు జిల్లా నుంచి పట్టణానికి వచ్చిన అశోక్ కుమార్.. ప్రైవేట్ లాడ్జ్‌లో రూమ్ తీసుకన్నాడు. ఉదయం రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన లాడ్జ్ సిబ్బంది డోర్ కొట్టగా.. అశోక్ కుమార్ ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో లాడ్జ్ యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని.. డోర్ పగలగొట్టి చూడగా.. ఉరివేసుకుని చనిపోయి కనిపించాడు. 

మరోవైపు అశోక్‌కుమార్‌కు ఈరోజే సొంత గ్రామంలో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే కొడుకు ఇంకా ఇంటికి చేరుకోకపోవడంతో..  అశోక్‌ కుమార్ తల్లిదండ్రులు ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయితే అశోక్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంతలోనే అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

పోస్టింగ్ బదిలీతో పాటు, నిశ్చితార్థం ఇష్టం లేకే అశోక్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే పోలీసులు అనుమానిస్తున్నారు. అశోక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

click me!