Huzurabad Bypoll : ‘ఈ’ ఇంటిపేరుతో మరో ముగ్గురు ‘రాజేందర్’ ల నామినేషన్లు..

By AN TeluguFirst Published Oct 9, 2021, 7:24 AM IST
Highlights

వారి ఇంటి పేర్లు కూడా ఈటల మాదిరిగానే ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు.

కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేరుతో నలుగురు ఉన్నారు. బాజపా తరఫున etela rajender  బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరు రోజున రాజేందర్ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 

వారి ఇంటి పేర్లు కూడా ఈటల మాదిరిగానే ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది, 43 మంది స్వతంత్రులతో పాటు మొత్తంగా 61మంది 92 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 

కాగా, Huzurabad Bypoll కోసం నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ఇదే రోజు బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. రాజేందర్‌తోపాటు హుజురాబాద్ ఉపఎన్నిక ఇన్చార్జ్ జితేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలూ వెళ్లారు. అనంతరం, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. 

హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ కేంద్ర, రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మారనుందని అన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ ఎన్నికలో పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

టీఆర్ఎస్ గెలువకుంటే రాష్ట్రంలో అమలయ్యే పథకాలు ఇక్కడ రావని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే తాను నామినేషన్ వేసినట్టు వివరించారు. ఇక రాబోయే ఇరవై రోజులు నియోజకవర్గంలో అక్రమాలు జరిగే అవకాశముందని, వాటిని అడ్డుకునే బాధ్యత నియోజకవర్గ ప్రజలదేనని అన్నారు.

ఇది ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కాదని, ఇది హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు అని జితేందర్ రెడ్డి అన్నారు. కాగా, కేంద్ర మంత్రి కిశన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికలు నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని తెలిపారు.

Huzurabad bypoll: ముగిసిన నామినేషన్ల గడువు, 26 నామినేషన్లు దాఖలు

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని, ఇందుకు హుజురాబాద్ ప్రజలే దారి వేయాలని కిషన్ రెడ్డి అన్నారు. గత ఏడున్నర ఏళ్లుగా ఎన్నికలకు ముందు హామీలివ్వడం తర్వాత వాటిని అటకెక్కించడం పరిపాటిగా మారిందని టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఆ పార్టీ వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. 

ఈటల రాజేందర్‌ను హుజురాబాద్ ప్రజలు గెలిపిస్తారని తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆయనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు అని విమర్శించారు.

click me!