వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి స్థానిక జనాలను బెదిరించారు. గాంధీ జయంతి నాటికి ఖతం కావాలి. లేకపోతే మీపై చర్యలు తప్పవు అని ఆమె హెచ్చరించారు. ఇంతకూ వరంగల్ జనాలను ఆమె ఎందుకు బెదిరించారో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
అక్టోబర్ 2 వరకే టైం ఇస్తున్న. ఆలోగా వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉండాలి. లేకపోతే మీ మీద చర్యలు తప్పవు అని కలెక్టర్ ఆమ్రపాలి హెచ్చరించారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంపై వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్పర్తి సంస్కృతి విహార్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరిధిలోని హసన్పర్తి, ఎల్కతుర్తి, ఐనవోలు, ధర్మసాగర్, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలకు చెం దిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. గాంధీ జయంతి వరకు లక్ష్యం పూర్తిచేయాలని.. ఇందుకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మరుగుదొడ్లులేని వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరిని ఒప్పించి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు కదిలించాల్సిన బాధ్యత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల మీద ఉందన్నారు.
గతంలో ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతు న్న మాట వాస్తవమన్నారు. ఇప్పుడు మాత్రం స్వచ్ఛభారత్ మిషన్(ఎస్బీఎం) కింద బిల్లులు చెల్లింపులు వెంటవెంటనే జరుగుతున్నాయని కలెక్టర్ వివరించారు. మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్బియ్యం, సబ్సిడీగ్యాస్, పెన్షన్తో పాటు ఇంటినిర్మాణ అనుమతులు కూడా నిలుపుదల చేస్తామని.. ఈ మేరకు వారికి అవగాహన కల్పించాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
.