
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటన ఏదో పార్టీ అధ్యక్షుడి మొక్కుబడి దేశాటన కాదు. షా పర్యటన వెనక లోతయిన వ్యూహం ఉంది. ఉత్తర ప్రదేశ్ వ్యూహం తెలంగాణాలో ప్రయోగించి, పింక్ పులి నుంచి ప్రభుత్వాన్ని లాగేసుకోవాలనే ఆత్రుత ఆయన పర్యటన వెనక కనబడుతుంది. దీనికోసం షా గత చరిత్రను నడుస్తున్న చరిత్రను పకడ్బందీగా వాడుకోవాలనుకుంటున్నారు. రెండు రోజుల్లో మొదలుకానున్న ఆయన తెలంగాణా పర్యటన వివరాలు చూస్తే ఇది కెసిఆర్ వ్యతిరేక పర్యటన అని, కెసిఆర్ కు వ్యతిరేకంగా అన్ని వర్గాలను సమీకరించే తొలి ప్రయత్నమని అర్థమవుతుంది.
అమిత్ షా ఈనెల 22న మూడు రోజుల పర్యటనకు తెలంగాణా వస్తున్నారు. అందులో మూడో రోజున అంటే మే 24న ఆయన నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం గుండ్రమ్ పల్లి గ్రామం చేరుకుంటారు ఆవూర్లో ఆయన ప్రతిఇంటిని సందర్శిస్తారు. తెలంగాణా చరిత్రలో గుండ్రంపల్లికి ఒక విశిష్టమయిన స్థానం ఉన్నసంగతి తెలసిందే. అక్కడ రజాకార్ల హత్యా కాండకు గురయిన 160 కుటుంబాలను కలుసుకుంటారు. వారితో కలసి భోజనంచేస్తారు. వారి త్యాగాలను కొనియాడతారు. నిజాం వ్యతిరేక పోరాటంలో వారు స్ఫూర్తిని ఇపుడు కూడా కొనసాగించాలని పిలుపు నిస్తారు. ఇది ఒక అసాధారణ కార్యక్రమం.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధునిక తెలంగాణా అత్యాధునిక చరిత్ర 1969 నుంచే మొదలవుతుంది. ఆయన అతి తక్కువగా మాట్లాడే విషయం కమ్యూనిస్టుల జరిపిన నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం. రజాకార్ల హత్యాకాండ. తెలంగాణా ప్రజలవీరోచిత కార్యాలు, త్యాగాలు ఆయన ప్రసంగాలలో తక్కువగా కనిపిస్తాయి. ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ తో కూడి తెలంగాణా ఉద్యమాలే ఆయన ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు.అవి మొదలయింది 1969 నుంచే.
నైజాం భారత్ విలీనాన్ని ఘనంగా అధికారికంగా జరపడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఓట్ల రాజకీయాలకు నైజాం వ్యతిరేక వీరోచిత ఉద్యమాలు, రజాకార్ల వ్యతిరేక ఉపన్యాసాలు పనికిరావు. అయితే, కెసిఆర్ వేటిని విస్మరిస్తున్నారో వాటినే హైలైట్ చేసేందుకు అమిత్ షా పూనుకున్నారు. అదే నైజాం వ్యతిరేక, రజాకార్ల వ్యతిరేక తెలంగాణా త్యాగాలు. దీనికోసం బిజెపి గుండ్రామ్ పల్లి గ్రామాన్ని ఎంచుకున్నారు.
గుండ్రాం పల్లి నైజాం వ్యతిరేక పోరాటంలో వేగుచుక్క. ఆవూరు పేరెత్తకుండా తెలంగాణా రైతంగా పోరాటం గురించి మాట్లాడుకోలేం.
గుండ్రమ్ పల్లిలో సయ్యద్ మక్బూల్ అనే వాడు రజాకార్ల ఏజంట్. కమ్యూనిస్టులు దళాలు ఒక రోజు మక్బూల్ ను మట్టు పెట్టేందుకు వూరి మీద పడ్డాయి. అయితే, అతగాడు వూర్లో లేడు. భార్య ఈ దాడిలో చనిపోయింది. దీనికి ప్రతీకారంగా ఈ వూరి మీద రజాకార్లు దాడి చేసి ఉచకోత కోశారు. ఈ సంఘటన 1948 జూలై లో జరిగింది. రజాకార్లు వూర్లొ చొరబడి, దాదాపు 20 మందిని కాల్చిచంపారు. శవాలన్నింటిని దగ్గిర్లోని బావిలో పడేశారు.
ఈ త్యాగానికి చిహ్నంగా రెండేళ్ల కిందట అక్కడొక స్తూపం కూడా కట్టారు.
తెలంగాణాలో రజాకార్ల దౌష్ట్యానికి గురయిన వారి వారసులను పరామర్శేంచేందుకు అమిత్ షా వస్తున్నారు.
అమిత్ షా పర్యటనలో మరొక విశేషం ఉంది.
దళితులను కలిసేందుకు దళిత వాడలకు వెళ్లడం, దళితులతో కలసి బోజనం చేయడం అది.
దళిత ముఖ్యమంత్రి విషయం కెసిఆర్ పక్కన పడేశారు. ఇది గుర్తుచేసేందుకు అమిత్ షా దళిత వాడల్లో తిరుగుతారు. వారితో కలసి భోజనమూ చేస్తారు. గతంలో ఏ బిజెపి అధ్యక్షుడు, బంగారు లక్ష్మణ్ తో కలిపి, ఇంత ఉధృతంగా దళితులను ఆకట్టుకునే వ్యూహం పన్నలేదు.మొన్నామధ్య ఆయన బెంగాల్ నక్సల్బరీలో కూడా దళితుడి ఇంట్లో ఆరిటాకు మీద భోజనం చేశాడు. అన్నీ దళితుల వంటకాలే.