కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలి: తెలంగాణ సర్కార్‌కి అఖిలపక్షం వినతి

By narsimha lodeFirst Published Apr 30, 2020, 1:07 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారంగా ఇవ్వాలని అఖిలపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారంగా ఇవ్వాలని అఖిలపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గురువారం నాడు అఖిలపక్ష నేతలు తెలంగాణ సీఎస్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ తో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ , సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తదితరులు సీఎస్ తో భేటీ అయ్యారు.సీఎస్  ముందు విపక్షాలు తమ డిమాండ్లను ముందు పెట్టాయి.సీఎస్ తో చర్చించిన వివరాలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో పేదల్లోని ప్రతి కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోరారు. తెల్లరేషన్ కార్డు ఉన్నా లేకున్నా ప్రతి పేదవాడికి రూ. 5 వేలు ఇవ్వాల్సిందిగా కోరారు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతను పెంచాలని ఆయన కోరారు. దీపం పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా ఇవ్వాల్సిందిగా కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

also read:తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌తో విపక్షాలు భేటీ: కరోనా, రైతుల సమస్యలపై చర్చ...

కరోనాపై ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతాంగాన్ని ఆదుకొనేందుకు రైతు రుణమాఫీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే  గవర్నర్ ను కలుస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ డిమాండ్ చేశారు. సీఎం సహాయనిధికి వచ్చిన లెక్కలను ప్రకటించాలని ఆయన కోరారు.రేషన్ కార్డులకు ధరఖాస్తు చేసుకొన్నవారికి కూడ నగదు పంపిణీ చేయాలని కోరారు.
 

click me!