
హైదరాబాద్: ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలవడానికి హైదరాబాదు రావడంపై కాంగ్రెసు నేత పొన్నాల లక్ష్మయ్య ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కేసీఆర్ 18 సార్లు కాల్ చేసి, చివరకు తన కుమారుడు కెటి రామారావును పంపిస్తే గానీ అఖిలేష్ రాలేదని ఆయన అన్నారు.
తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బిజెపికి సాయపడేందుకు కేసిఆర్ పనిచేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఫ్రంట్ పేరుతో కేసిఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.
కేసిఆర్ తెలంగాణవాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని వ్యాఖ్యానించారు. అఖిలేష్ కు కాల్స్ చేసిన విషయం రుజువు కావడానికి కేసిఆర్ తన ఫోన్ కాల్ లిస్టును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సోనియా గాంధీ కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలను కేసిఆర్ ప్రజలకు ఇచ్చారని ఆయన అన్నారు.