Waqf Amendment Act 2025 : తెలంగాణలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిరసనలు

Arun Kumar PPublished : May 17, 2025 3:30 PM

వక్ఫ్ సవరణ చట్టం 2025 ని వ్యతిరేకిస్తూ తెలంగాణలో నిరసనలకు పిలుపునిచ్చింది  AIMPLB (ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్). ఈ మేరకు ఓ ప్రకటన విడుదలచేసింది. ఇందులో ఏముందంటే..     

Hyderabad : ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) వక్ఫ్ చట్టానికి కేంద్రం చేపట్టిన సవరణలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది. వక్ఫ్ చట్ట సవరణలను వివక్షపూరితంగా ఉందని.. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. కాబట్టి ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అంతటా నిరసనలకు పిలుపునిచ్చింది ఏఐఎంపిఎల్బి.

ఇవాళ(శనివారం) ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. “వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలు వివక్షతో కూడుకున్నవి, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయి. ముస్లిం వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని లేదంటే నాశనం చేయాలనే కుట్రలో భాగమే ఈ సవరణ చట్టం” అని పేర్కొంది. అధికార పార్టీ తన సంఖ్యాబలం ఉపయోగించి కోట్లాదిమంది ముస్లింలు, మైనారిటీలు మరియు దేశంలోని న్యాయం కోరుకునే పౌరుల ఇష్టానికి వ్యతిరేకంగా వక్ఫ్ చట్టానికి ఏకపక్ష సవరణలను ఆమోదించిందని బోర్డు ఆరోపించింది. 

"ఈ సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 25, 26 మరియు 29లను ఉల్లంఘించడమే కాకుండా వక్ఫ్ ఆస్తి పరిపాలనపై పూర్తి నియంత్రణ సాధించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెడుతున్నాయి" అని ప్రకటనలో పేర్కొంది.

AIMPLB ప్రకారం సవరించిన చట్టం ముస్లిం సమాజానికి తమ మతపరమైన దానధర్మాలను నిర్వహించుకునే హక్కును హరిస్తుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సభ్యుల ఎంపిక ప్రక్రియలో మార్పులు వారి స్వయంప్రతిపత్తిని మరింతగా దెబ్బతీస్తాయి. వక్ఫ్ (దాత) ఐదు సంవత్సరాలుగా ముస్లింగా ఉండాలనే కొత్త షరతును కూడా బోర్డు వ్యతిరేకించింది.. ఇది భారత రాజ్యాంగ సూత్రాలు, ఇస్లామిక్ షరియా రెండింటికీ వ్యతిరేకమని పేర్కొంది. 

హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు మరియు బౌద్ధులు వంటి ఇతర మత సమాజాలు తమ మతపరమైన ఆస్తులపై రక్షణలను కలిగి ఉన్నాయని... అయితే ముస్లింలకు ఇలాంటి హక్కులు నిరాకరించబడుతున్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎఐఎంపిఎల్బి నోటిమాటగానే కాకుండా వ్రాతపూర్వక అభ్యంతరాలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి సమర్పించిందని... కోట్లాదిమంది మంది ముస్లింలు JPC ఛైర్మన్‌కు ఇమెయిల్‌లు పంపి సవరణలను తిరస్కరించారని పేర్కొంది. అయితే, ఈ అభ్యంతరాలను విస్మరించారని బోర్డు ఆరోపించింది.

"చివరి ప్రయత్నంగా మేము ఈ సవరణలను సుప్రీంకోర్టులో సవాలు చేశాము. ఇప్పుడు మేము ఈ సమస్యను ప్రజల కోర్టుకు కూడా తీసుకువెళుతున్నాము" అని బోర్డు తెలిపింది. తెలంగాణలో రాష్ట్రవ్యాప్త కార్యక్రమంతో ప్రారంభించి మూడు నెలల పాటు శాంతియుతమైన, దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామని ప్రకటించింది. ఈ మత నాయకులు, రాజకీయ నాయకులు, పౌర సమాజ సభ్యులు మరియు మైనారిటీ వర్గాల భాగస్వామ్యంతో రాజ్యాంగ మరియు చట్టాలకు లోబడి ఈ ప్రచారాన్ని నిర్వహిస్తామని తెలిపింది.

 

Read more Articles on
click me!