
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పలువురు ఆందోళనకారులను గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ల వేదికగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరసనకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే కుట్రకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ విధ్వంసం వెనక ఏపీలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా కొన్ని టీవీ చానళ్లు కథనాలు ప్రచురించాయి.
సుబ్బారావు రెచ్చగొట్టడంతోనే విధ్వంసం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సుబ్బారావు.. గుంటూరు నుంచి మొన్న రాత్రి హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థులను రెచ్చగొట్టాడనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయనను ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సుబ్బారావును నరసరావుపేట తరలించారు.
డిఫెన్స్ పరీక్షల సంబంధించి కోచింగ్ ఇస్తున్న ఆవుల సుబ్బారావు.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువకులను రెచ్చగొట్టినట్టుగా తెలస్తోంది. ఇక, నిన్నటి ఆందోళనలో 10 డిఫెన్స్ అకాడమీలకు చెందిన ఆందోళకారులు పాల్గొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక, వాట్సాప్ గ్రూప్ల వేదికగానే సికింద్రాబాద్ వద్ద నిరసన తెలిపేందుకు చాటింగ్లు జరిగినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని పలు న్యూస్ చానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో పలువురు.. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కోచింగ్ పొందారు. ఆ సమయంలో వీరు కొన్ని వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఆర్మీ రిక్రూట్మెంట్ గురించిన సమాచారం, ప్రిపరేషన్ టిప్స్ షేర్ చేసుకునేవారు.
అయితే మూడు రోజుల క్రితం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన వెలువడగానే.. ఒక్కసారి ఈ వాట్సాప్ గ్రూప్లు యాక్టివ్ అయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్ గురించి వాట్స్ప్ గ్రూప్లలో తీవ్ర చర్చ సాగింది. అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఆర్మీ తమ కేరీర్ అవకాశాలు దెబ్బతింటాయని వారు భావించారు. ఈ క్రమంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా నిరసనల గురించి తెలియడంతో.. సికింద్రాబాద్ వద్ద కూడా నిరసన తెలియజేయాలని వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్లు, ఆడియో క్లిప్స్ షేర్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం నుంచే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు పలువురు యువకులు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు తొలుత రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి రైళ్లకు నిప్పుపెట్టి, స్టేషన్లోని రైళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్న యువకులు వాట్సాప్ సందేశాలను పరిశీలిస్తున్నారు.