ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి నాలుగో రోజు కస్టడీ పూర్తయ్యింది. నర్సింహారెడ్డి అక్రమాలు, బిజినెస్లు, బినామీలపై ఏసీబీ ఆరా తీసింది
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి నాలుగో రోజు కస్టడీ పూర్తయ్యింది. నర్సింహారెడ్డి అక్రమాలు, బిజినెస్లు, బినామీలపై ఏసీబీ ఆరా తీసింది. పెద్ద అంబర్పేటలో ఓ హోటల్ను ఆయన బినామీల పేరుతో నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు పోలీసులతో కలిసి నర్సింహారెడ్డి భూములు కాజేసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అలాగే బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసినట్లు ఏసీబీ గుర్తించింది.
ఇప్పటికే అనంతపురంలో 55 ఎకరాల పొలం, మాదాపూర్లోని సర్వే నెంబర్ 64లో 1,960 గజాల స్థలంతో పాటు పలు చోట్ల ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు . దర్యాప్తులో నర్సింహారెడ్డి తన బినామీ ఆస్తుల గురించి నోరు విప్పకపోవడంతో ఆధారాలను అతని ముందుంచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు.
కోట్ల ఆస్తులు కూటడబెట్టిన ఏసీపీ నర్సింహారెడ్డి అరెస్టు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కుంటున్న మల్కాజిగిరి ఏసీబీ వై. నర్సింహా రెడ్డి పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలిన విషయం తెలిసిందే. దాదాపు 70 కోట్ల రూపాయల విలువ చేసే అస్తులను అతను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బుధవారం నర్సింహారెడ్డి నివాసంలోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
ఏసీబీ అధికారుల బృందాలుగా విడిపోయిన హైదరాబాదులోని మహేంద్రహిల్స్ లో గల ఆయన నివాసంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు. వరంగల్, జనగామ, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు జరిగాయి. తెలంగాణ, ఏపీల్లోనే 25 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపారు.
బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సోదాల్లో నర్సింహారెడ్డికి ఉన్న ఆస్తులను గుర్తించారు. 3 ఇళ్లు, 5 ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అతని అస్తుల విలువల రూ.7.5 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం రూ.70 కోట్లు ఉంటుందని అంచనా వేశారు
నర్సింహారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు ఆయనకు రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డి గతంలో మియాపూర్, ఉప్పల్, బేగంపేట ఇన్ స్పెక్టర్ గా, చిక్కడపల్లి డివిజన్ లో ఏసీపీగా పనిచేశారు అక్కడి నుంచి మల్కాజిగిరికి బదిలీ అయ్యారు.