కరోనాతో 45 రోజుల చిన్నారి మృతి: వైరస్ ఎలా సోకిందో అర్థంకాక అధికారుల ఆందోళన

By Sree sFirst Published Apr 20, 2020, 6:43 AM IST
Highlights

45 రోజుల పసికందు నారాయణపేట జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన విషయం తెలిసిందే. ఈ పసికందు నిన్న మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. పసికందు తల్లి, తండ్రి నానమ్మలు క్వారంటైన్ లో ఉన్నారు. 

45 రోజుల పసికందు నారాయణపేట జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన విషయం తెలిసిందే. ఈ పసికందు నిన్న మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. పసికందు తల్లి, తండ్రి నానమ్మలు క్వారంటైన్ లో ఉన్నారు. 

ఏప్రిల్ 17వ తేదీన ఈ పసి గుడ్డు కరోనా పాజిటివ్ గా తేలడంతో నీలోఫర్ నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ పసివాడు ప్రాణాలు వదిలాడు. ఈ మరణంతో నారాయణపేట జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పిల్లాడికి కరోనా ఎలా సోయిందనే విషయం వారికింకా అర్థం కావడంలేదు. ఆ పిల్లాడికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు నర్సులను కలిపి ఒక 20 మంది అనుమానితుల లిస్టునయితే తయారు చేసారు. 

నారాయణపేట జిల్లాలో ఈ పసిగుడ్డును మినహాయిస్తే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి జిల్లాలో ఈ పిల్లాడికి కరోనా సోకిందని అధికారులు భావించడం లేదు. అతడి తల్లిదండ్రులు గొర్రెల కాపరులు. వారు జిల్లాదాటి బయటకు వెళ్ళింది లేదు. ఈ నేపథ్యంలో ఈ పసిగుడ్డుకు ఆసుపత్రిలో వైద్యం అందించిన డాక్టర్లు, నర్సుల నుండి ఈ వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

ఇప్పటివరకు 20 మంది అనుమానితుల సాంపుల్స్ సేకరించి వాటిని టెస్టులకు పంపించారు. అందులో 12 టెస్టుల రిజల్ట్స్ రాగా అన్ని కూడా నెగటివ్ అనే తేలాయి. మరో 8 టెస్టుల ఫలితాలు రావలిసి ఉంది. 

ఏప్రిల్ 8వ తేదీన ఈ పసిగుడ్డును టీకా ఇప్పించారు. ఏప్రిల్ 11వ తేదీన పసికందు జ్వరం తో బాధపడుతుండటంతో... టీకా వల్ల అని భావించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళితే.... వారు మహబూబ్ నగర్ కి తరలించమని చెప్పారు. అక్కడ చికిత్సనందిస్తూనే... మరింత మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ లోని నీలోఫర్ కి తరలించమని చెప్పారు. 

గడిచిన 5 రోజులుగా ఆ పిల్లాడిని ఆసుపత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. అధికారుల అంచనాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, నీలోఫర్ ఆసుపత్రిలో కానీ ఈ పసికందుకి కరోనా వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా నీలోఫర్ ఆసుపత్రి అధికారులు ఏప్రిల్ 15 నైట్ షిఫ్ట్ నాడు, 16, 17 తారీఖుల్లో మూడు షిఫ్తుల్లో ఇఎస్ఆర్ లో పనిచేసిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులతోని సహా క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆదేశించారు. నారాయణపేట చిన్నారి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆసుపత్రి వర్గాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. 

click me!