
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పదో తరగతి పేపర్ లీక్ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా.. ఈ నెల 4వ తేదీన టెన్త్ క్లాస్ హీందీ పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. ప్రశాంత్ అనే వ్యక్తి పలువురికి వాట్సాప్ ద్వారా టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ ను పంపినట్టుగా పోలీసులు ప్రకటించారు. బండి సంజయ్ , ఈటల రాజేందర్ సహా పలువురికి ప్రశాంత్ నుండి వాట్సాప్ లో టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం చేరిందని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు.
Also Read: నా ఫోన్ కేసీఆర్ వద్దే, రంగనాథ్ చిట్టా బయటపెడతా: బండి సంజయ్
ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. గత మంగళవారం రాత్రి బండి సంజయ్ను కరీంనగర్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బొమ్మలరామారం పోలీసు స్టేషన్కు తరలించారు. బండి సంజయ్ను బుధవారం బొమ్మలరామారం నుంచి వరంగల్కు తరలించారు. ఆయనను బుధవారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంజయ్ను నిన్న రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో బండి సంజయ్ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయనపై ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బండి సంజయ్కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.