పెళ్లికి నిరాకరించడంతో...ప్రియురాలి ఇంటి ఎదుటే అఘాయిత్యం

By Nagaraju TFirst Published Sep 28, 2018, 3:41 PM IST
Highlights

మూడేళ్ల ప్రేమ మూడు ముళ్ల బంధం కావాలని ఆ యువకుడు తపించాడు. ఇష్టపడిన ప్రియురాలుతో ఏడడుగులు నడవాలని కలలుకన్నాడు. కానీ విధి అతడి ప్రేమను అపహాస్యం చేసింది. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించింది. 

వికారాబాద్ : మూడేళ్ల ప్రేమ మూడు ముళ్ల బంధం కావాలని ఆ యువకుడు తపించాడు. ఇష్టపడిన ప్రియురాలుతో ఏడడుగులు నడవాలని కలలుకన్నాడు. కానీ విధి అతడి ప్రేమను అపహాస్యం చేసింది. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించింది. మనువాడేది లేదంటూ గుడ్ బై చెప్పేసింది. ఆమె లేని జీవితం ఎందుకు అనుకున్నాడేమో ఆమె ఇంటి ఎదుటే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ యువకుడు. అందర్నీ కలచివేస్తున్న ఈ ఘటన వికారాబాద్ జిల్లా చేవేళ్లలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే చేవెళ్ల మండలం మల్లారెడ్డిగూడ పంచాయితీ ఎర్రోనిటాల గ్రామానికి చెందిన దర్శన్, మల్లమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంతానం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

పెద్దకుమారుడు మహిపాల్(27) తొమ్మిదో తరగతి వరకు చేవెళ్లలోని నవచైతన్య పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువులోని బంధువుల ఇంటి వద్ద ఉంటూ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు. ఏడాది క్రితం వ్యవసాయశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం మహిపాల్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో వ్యవసాయ శాఖలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్నాడు.  

అయితే మహిపాల్ చదువుకున్న రోజుల్లో పరిచయం అయిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చదువు అయిపోవడం, ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించడంతో పెళ్లి ప్రేమించిన యువతని పెళ్లి చేసుకుందామని భావించాడు. తన మనసులోని మాటను ప్రియురాలితో చెప్పాడు. ప్రియురాలు మహిపాల్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. మనువాడనంటూ మెుఖం మీదే చెప్పేసింది.  

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మానసికంగా ఆందోళన చెందిన మహిపాల్ బుధవారం రాత్రి వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలోని ప్రేమించిన అమ్మా యి ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంటి ఎదుటే రాత్రి 7 :30 గంటల సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 తమకు ఆసరాగా ఉంటానుకున్న కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరివళ్లా కావడం లేదు. స్థానికులు సైతం కుటుంబ సభ్యుల రోదనలు చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.  

click me!