కరెంటు మ్యాజిక్ కేసిఆర్ ది కాదు.. మోదీ దే

First Published Jan 3, 2018, 4:16 PM IST
Highlights
  • ఉదయ్ స్కీముతోనే నిరంతర విద్యుత్
  • మిగతా రాష్ట్రాల్లో లాగే తెలంగాణలో
  • రాష్ట్ర సర్కారు చేసిందేమీ లేదు
  • ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు తెలంగాణ సర్కారు

తెలంగాణలో 24 గంటల కరెంటు విజయం మా ఘనత అని తెలంగాణ సర్కారు చెప్పుకుంటున్నది. ఈ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకున్నది. కొన్ని ఇంటర్నేషనల్ పత్రికలకు కూడా యాడ్స్ కుమ్మరించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసిఆర్ సాధించిన ఘన విజయంగా సర్కారు ప్రచారం చేసుకుంటున్నది.

ఇక కేసిఆర్ ఇలా ప్రచారం చేసుకుంటుంటే అదంతా ఉత్తదే అని ఒకవైపు తెలంగాణ జెఎసి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్ లోకి బిజెపి కూడా ఎంటరైంది. నిరంతర విద్యుత్ ఘనత వందకు వంద శాతం బిజెపికే చెల్లుతుందని ప్రకటించారు బిజెపి నేతలు.

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అనేది టిఆర్ఎస్ సర్కారు సాధించిన విజయం కాదని.. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ విజయమే అని కుండబద్ధలు కొట్టారు. 2018 నుంచి తెలంగాణ లో నిరంతర విద్యుత్ ఇవ్వాలని కేంద్రం గతంలోనే నిర్ణయించిందన్నారు. ఉదయ్ పథకం లో రాష్ట్రాన్ని చేర్చడం ఇందులో కీలకమైన ప్రక్రియ అన్నారు. అలాగే నార్త్ సౌత్ గ్రిడ్ అనుసంధానం చేయడం కూడా జరిగిందన్నారు. అంతేకాకుండా యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ కు  అనుమతులు కేంద్రం ఇచ్చింది కాబట్టే నిరంతర విద్యుత్ సాకారమైందని ఆయన చెప్పుకొచ్చారు.

నిరంతర విద్యుత్ విషయంలో కేంద్రం సాధించిన విజయాన్ని రాష్ట్రం తమ ఖాతాలో వేసుకుంటున్నదని విమర్శించారు. నేతి బీర లో నేతి ఉన్నట్టే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం ఉన్నదని ఎద్దేవా చేశారు.

ఒక్క మెగావాట్ ఉత్పత్తి పెరగకుండా కేసిఆర్ సర్కారే ఎలా నిరంతర పవర్ ఇస్తుందని ప్రశ్నించారు. 2014 ముందు దేశం లో విద్యుత్ లోటు లో ఉండేదని, కానీ మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశం లో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. 19 రాష్ట్రాల్లో సర్ప్లస్ విద్యుత్ మోడీ సర్కారు వచ్చాక సాధించిన విజయం అన్నారు. కానీ 19 రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణలోనూ నిరంతర విద్యుత్ అందిస్తుంటే ఇదేదో రాష్ట్ర సర్కారు ఘనత అని చెప్పుకోవడం విడ్డురంగా ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు సమాచారం మాత్రమే చెప్పింది.. ఆ మాటలు నమ్మి పవన్ మాట్లాడుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారరు. కానీ త్వరలోనే పవన్ విషయం అర్థం చేసుకుంటారని వాస్తవాలు తెలుసుకుంటారని ఆకాంక్షించారు.

మసీద్ కు ఎవరూ పోతలేరు : కైలాష్ విజయవర్గీయ

మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఇప్పుడు విపక్ష నేతలు.. మసీదులకు వెళ్లడం మానేసి  గుళ్లకు బాట పట్టారని చమత్కరించారు. మమత బెనర్జీ .. గంగా తీర్థం వెళ్తోంది.. బ్రాహ్మణ సమ్మేళనం ఏర్పాటు చేస్తోంది అని తెలిపారు. మోడీ నేతృత్వంలో తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి వస్తుందన్నారు. అమిత్ షా కుమారుడి మీద వచ్చిన ఆరోపణలు కోర్ట్ లో ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మతం ఆధారంగా రిజర్వేషన్స్ కు తాము వ్యతిరేకం..కానీ ఆర్థికంగా వెనుకబాటు పై చర్చ జరగాలన్నారు. మహారాష్ట్రలో బయటి వ్యక్తుల వల్లే హింస జరిగినట్లు ఆ రాష్ట్ర సీఎం చెప్పారన్నారు. దానిపై విచారణ జరుగుతోందన్నారు.  

 

click me!