కుక్క దాడిలో గాయపడిన చిన్నారి.. 40 రోజులు ప్రాణాలతో పోరాడి మృతి..

By Sumanth KanukulaFirst Published Mar 19, 2023, 10:05 AM IST
Highlights

గత కొంతకాలంగా తెలంగాణలో కుక్క కాటు కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కుక్క దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 

హైదరాబాద్‌‌‌: గత కొంతకాలంగా తెలంగాణలో కుక్క కాటు కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కుక్క దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 40 రోజులు ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన చిరంజీవి-రజితల కుమార్తె మహేశ్వరి ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది.  దాదాపు 40 రోజుల క్రితం ఇంటి సమీపంలోనే మహేశ్వరిపై కుక్క దాడి చేసింది. 

దీంతో మహేశ్వరిని ఆమె తల్లిదండ్రులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మహేశ్వరిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మహేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటం.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ఖర్చులు భరించలేక మార్చి 9న మహేశ్వరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్వరి తుదిశ్వాస విడిచింది. 

ఈ ఘటనతో మహేశ్వరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మహేశ్వరి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ కూతురును బతికించుకోవడానికి  అనేక రకాలుగా ప్రయత్నాలు చేశామని మహేశ్వరి తల్లిదండ్రులు చెప్పారు. విరాళాలు, రుణాల ద్వారా రూ. 10 లక్షలకు పైగా సేకరించి ఖర్చు చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. 

click me!