13యేళ్ల బాలికకు గుండెపోటు.. నిద్రలో ఆయాసపడుతూ లేచి.. అంతలోనే...

By SumaBala BukkaFirst Published Apr 1, 2023, 7:32 AM IST
Highlights

గుండెపోటుతో ఓ 13యేళ్ల బాలిక మృతి చెందింది. ఉదయమంతా స్నేహితులతో ఆడుకున్న ఆ చిన్నారి.. రాత్రికి నిద్ర పోయి.. ఆయాసపడుతూ లేచి.. అంతలోనే మరణించింది. 

మహబూబాబాద్ జిల్లా : తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటు ఓ 13 ఏళ్ల చిన్నారిని బలి తీసుకుంది. మెహబూబాబా బాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాయిపాలెం శివారు బోడ తండాకు చెందిన దంపతులు బోడ లక్పతి, వసంత. వారి కూతురు స్రవంతి. 13యేళ్ల చిన్నారి. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం నాడు పాఠశాలకు సెలవు ఇచ్చారు.

సెలవు రోజు కావడంతో తండాలోని తన స్నేహితులతో రోజంతా ఆడుకుంది. రాత్రి అయ్యాక మామూలుగానే నిద్రపోయింది. ఆమెకు రోజూ నానమ్మ దగ్గర పడుకునే అలవాటు. ఆ రోజు కూడా అలాగే పడుకుంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున సడన్ గా మేల్కొన్న ఆమె.. తనకు ఏదో అవుతుందని ఆయాస పడుతూ నాన్నమ్మను లేపింది. కంగారుపడి నిద్రలేచిన ఆమె ఏం జరిగిందని అడుగుతుంటే..  ఆయాస పడుతూ మాట్లాడలేకపోయింది.. మంచం మీద లేచి కూర్చుని ఒక్కసారిగా మంచం పైనే పక్కకు ఒరిగిపోయింది. 

'బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా.. ' : సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు

వెంటనే ఆమె తన కొడుకు, కోడలికి విషయం తెలిపింది. కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే కూతుర్ని తీసుకుని దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి  పరుగులు తీశారు. అయితే, అక్కడికి వెళ్లేసరికి ఆమె చనిపోయిందని డాక్టర్ తెలపడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదిలా ఉండగా, గుండెపోటు మరణాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోయి, జిమ్ చేస్తూ, డాన్స్ చేస్తూ, కూర్చున్న కుర్చీలో అలాగే వాలిపోయి.. ఇలా.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా... గుండెపోటు కబలిస్తుందో తెలియకుండా పోతుంది. తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ కి కదులుతున్న కారులోనే ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇది అటుగా వెళుతున్న ఒక పోలీసు అధికారి గమనించాడు. వెంటనే అప్రమత్తమై అతడికి సిపిఆర్ చేసి కాపాడేందుకు ప్రయత్నించాడు. సిపిఆర్ తర్వాత బాధితుడు కొంత తేరుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అతని ప్రాణాలు దక్కలేదు.

హైదరాబాదులోని మలక్పేట్ ధోబిగల్లీకి చెందిన కావలి శ్రీనివాస్ (42) భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి కొన్నాళ్లుగా హయత్ నగర్ లో అద్దెకు ఉంటున్నాడు. శ్రీనివాస్ క్యాబ్ డ్రైవర్. క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ కుటుంబాన్ని తన క్యాబ్లో యాదగిరిగుట్టకు తీసుకెళుతున్నాడు. అప్పటివరకు బాగానే ఉన్నారు. ఓఆర్ఆర్ఎగ్జిట్ దాటి  కాస్త ముందుకు వెళ్లారు. అదే సమయంలో శ్రీనివాస్ కు గుండె నొప్పి వచ్చింది. గేర్ రాడ్ దిక్కు కుప్పకూలిపోయాడు. 

దీంతో వెనక సీట్లో ఉన్న ప్రయాణికురాలు అప్రమత్తమయ్యింది. వెనక సీటులో నుంచి స్టీరింగ్ను నియంత్రించడానికి ప్రయత్నించింది.  అయితే, అదే సమయంలో రామన్నపేట సిఐ మోతీరాం అదే మార్గంలో వెడుతున్నారు. ముందు వెళుతున్న కారు నెమ్మదిగా వెళ్లడం గమనించారు. దీంతో ఏదో జరిగిందన్న అనుమానంతో చూడగా.. డ్రైవరు పడిపోవడం వెనక సీట్ లో నుంచి మహిళ స్టీరింగ్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం కనిపించింది. వెంటనే విషయం అర్థమై.. తన వాహనంలోనుంచి బయటికి దిగి.. మరో వ్యక్తి సహాయంతో తీవ్ర ప్రయత్నం మీదట ఆ కారును నియంత్రించారు. 

డ్రైవింగ్ సీట్లో ఉన్న డ్రైవర్ శ్రీనివాస్ ను బయటకు తీశారు. సిపీఆర్ చేశారు. శ్రీనివాస్ స్పృహలోకి రావడంతో వెంటనే తమ వాహనంలోనే హయత్ నగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ బాధితుడిని పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీంతో  తాము చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడ్డారు. కుటుంబ సభ్యులకు సమాచారం  అందించారు. 

click me!