తెలంగాణలో పెరుగుతున్న కరోనా తీవ్రత: ఒక్కరోజే 1,213 కేసులు, 18 వేలు దాటిన సంఖ్య

By Siva KodatiFirst Published Jul 2, 2020, 10:26 PM IST
Highlights

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 1,213 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,750కి చేరింది

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 1,213 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,750కి చేరింది.

ఇవాళ వైరస్ కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మృతుల సంఖ్య 275కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇవాళ 987 మంది డిశ్చార్జ్ అవ్వడంతో 9,069 కోలుకున్నట్లయ్యింది. గురువారం ఒక్క హైదరాబాద్‌లోనే 998 మందికి పాజిటివ్‌గా తేలింది.

Also Read:లాక్ డౌన్ ఉల్లంఘనలు: హైదరాబాదీలే టాప్

ఆ తర్వాత మేడ్చల్ 54, రంగారెడ్డి 48, ఖమ్మం 18, వరంగల్ (రూ) 10, వరంగల్ అర్బన్ 9, నల్గొండలో 8, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, భద్రాద్రిలో ఏడేసి కేసులు, కరీంనగర్, మహబూబాబాద్, నిజామాబాద్‌లో ఐదేసి కేసులు, సూర్యాపేట, ములుగు, జగిత్యాల, నిర్మల్‌లో నాలుగేసి కేసులు, సిరిసిల్ల 6, కామారెడ్డి, నారాయణ్‌పేటలో రెండేసి కేసులు, వికారాబాద్, గద్వాల, సిద్ధిపేట, మెదక్, యాదాద్రి, నాగర్ కర్నూల్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

కాగా, లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో మన హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బి)ని ఉల్లంఘించడంలో మన జంటనగరళవాసులు ముందున్నారు. 

మార్చి 22 నాటి నుంచి ఈ చట్టం అమలులో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ లాక్ డౌన్ కాలంలో మొత్తంగా  67,557 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం నుండి.....  లాక్‌డౌన్‌ వేళల్లో అకారణంగా బయట తిరగడం వంటి అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డవారిపై ఈ కేసులను నమోదు చేసారు పోలీసులు. 

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 67వేల పైచిలుకు కేసుల్లో....14,346 కేసులతో మన భాగ్యనగరం అగ్ర స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాతి స్థానంలో 6,372 కేసులతో ఖమ్మం కమిషనరేట్‌ రెండవ స్థానంలో ఉంది. 

Also Read:హైదరాబాద్ లో లాక్ డౌన్: ప్రభుత్వం వెనక్కి తగ్గిందా...?

తెలంగాణ పరిధిలో మాస్కు పెట్టుకోకపోతే పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు పెట్టుకోనివారికి 3,288 మందికి చలానాలు విధించారు. 

మాస్కులు పెట్టుకోనివారిని కృత్రిమ మేధ‌ సాంకేతికత అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నవారికి జారీ చేసిన చలనాల్లో వనపర్తి జిల్లా 846 కేసులతో తొలి స్థానంలో ఉండగా...   585 కేసులతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం

click me!