
హైదరాబాద్: కన్స్ట్రక్షన్ సైట్లలో సెక్యూరిటీ గార్డులను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బుధవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్సీ పురం, శంకర్పల్లి ఘటనలతో అంతరాష్ట్ర దొంగలు రాష్ట్రంలోకి వచ్చారని భావించి టీమ్స్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.
ఖచ్చితమైన సమాచారం మేరకు దొంగలను అరెస్ట్ చేశఆమని ఆయన తెలిపారు. దొంగతనం చేసిన వారి దగ్గర నుంచి మెటీరియల్ కొనేవారిని కూడా అరెస్ట్ చేశామన్నారు..
వీరిలో మనీష్ అనే ఓ ఎలక్ట్రికల్ షాప్ ఓనర్తో పాటు, స్క్రాప్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి కూడ ఉన్నారు.నిందితుల నుంచి సుమారు 55 లక్షల రూపాయలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ తెలిపారు.
నిందితుల నుండి 9,50,000 రూపాయల నగదు సీజ్ చేశామని ఆయన చెప్పారు. ఇందులో ప్రధాన నందితులైన యూపీ, రాజస్తాన్కు చెందిన 11 మందిని అరెస్ట్ చేశామన్నారు
నిందితులంతా ఎలక్ట్రిషన్స్.. వీరందరూ ఢిల్లీలో పని చేసినపుడు కలుసుకున్నారు. కొన్ని రోజులు హైదరాబాద్లో నిర్మాణ సంస్థలో పని చేశారు. కొల్లూరులో దొంగతనం చేశాక ఆ మెటీరియల్ను మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేశారు. వచ్చిన డబ్బులను జల్సాలకు వాడేవారని పోలీసులు తెలిపారు.
దొంగతనం చేయడానికి వర్క్ కావాలనే సాకుతో సైట్లోకి వెళ్లి రెక్కి నిర్వహించేవారు. ఒకరు వర్క్ గురించి మాట్లాడుతుంటే మరి కొందరు అక్కడ పరిసరాలను గమనించేవారని విచారణలో తేలిందని సజ్జనార్ చెప్పారు.
రాజస్తాన్కు చెందిన ప్రదీప్ కుష్వాల్ ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు.
దొంగతనాలు చేసేటప్పుడు బెదిరించటానికి వాడిన తుపాకిని రాజస్తాన్లో కొన్నారని సీపీ తెలిపారు.నిందితులపై పీడీ యాక్ట్ పెడుతామన్నారు.