తండ్రి వారసత్వ ఆస్తి ఇవ్వడం లేదని.. టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

By telugu news teamFirst Published Mar 26, 2021, 8:23 AM IST
Highlights

వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి.

తన తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి తనకు ఇవ్వడం లేదంటూ ఓ టెన్త్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొడంగల్‌ పట్టణానికి చెందిన కాంసన్‌పల్లి వెంకటయ్య కుమారుడు నిఖిల్‌ (16) చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ ఊరైన హస్నాబాద్‌లో నివాసం ఉంటూ అక్కడే పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కాంసన్‌పల్లి వెంకటయ్య, అంజమ్మ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.


వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ సమయంలో నిఖిల్‌ తన పెదనాన్నలతో మాట్లాడి వారసత్వంగా తమకు చెందాల్సిన భూమిని తమ తండ్రి పేరున పట్టా చేయాలని అడగ్గా.. సరేనని చెప్పిన వారు కాలయాపన చేస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి హస్నాబాద్‌లోని ఆరుబయటే నిద్రించిన నిఖిల్‌ రాత్రికి రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున వృద్ధురాలు లేచి చూడగా..నిఖిల్‌ చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో స్థానికుల సాయంతో కిందకు దించారు. అయితే అప్పటికే నిఖిల్‌ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి అమ్మమ్మ బెస్త చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. 
 

click me!