తెలంగాణలో మొత్తం 70.79 శాతం పోలింగ్ నమోదు.. 2018లోనే బెటర్, రీపోలింగ్‌ అక్కర్లేదు : వికాస్ రాజ్

By Siva KodatiFirst Published Dec 1, 2023, 2:36 PM IST
Highlights

తెలంగాణలో 70.79 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు . 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిందని, రాష్ట్రంలో రీ పోలింగ్‌ నిర్వహించాల్సి అవసరం లేదన్నారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్ రాజ్ చెప్పారు. 

తెలంగాణలో 70.79 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిందని, అప్పుడు 73.37 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. ఆదివారం తెలంగాణలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని.. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామని.. ఓట్ ఫ్రం హోం మంచి ఫలితాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోసం 2 లక్షల మందికి పైగా సిబ్బంది శ్రమించారని వికాస్ రాజ్ ప్రశంసించారు. 

రాష్ట్రంలో రీ పోలింగ్‌ నిర్వహించాల్సి అవసరం లేదని.. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదవ్వగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56 శాతం పోలింగ్ నమోదైనట్లు వికాస్ రాజ్ తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టార్ అధికారిని పెట్టామని.. 4,039 రూట్ ఆఫీసర్లు , 1251 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్ రాజ్ చెప్పారు. 

Latest Videos

లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని చెప్పారు. మునుగోడులో 91.5 శాతం, యాకత్‌పురాలో 39.6 శాతం పోలింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 18 నుంచి 19 వయసున్న ఓటర్లు 3.06 శాతం వున్నారని సీఈవో చెప్పారు. ప్రస్తుతం పోలైన ఓట్ల వివరాల పరిశీలన జరుగుతోందని.. మరికాసేపట్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత పోలింగ్‌పై స్పష్టత వస్తుందని వికాస్ రాజ్ వెల్లడించారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 


 


 

click me!