బీజేపీ , బీఆర్ఎస్ , ఎంఐఎం ఒక్కటే .. మోడీ చెప్పిన చోట ఒవైసీ పోటీ .. కేసీఆర్‌ను దించగలరా : రాహుల్ గాంధీ

By Siva KodatiFirst Published Nov 25, 2023, 3:30 PM IST
Highlights

బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం మధ్య ఒప్పందం వందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీకి కేసీఆర్, అసదుద్దీన్ మంచి మిత్రులని రాహుల్ ఆరోపించారు. మోడీకి ఢిల్లీలో కేసీఆర్, అసదుద్దీన్‌లు సహాయం చేస్తారని.. తెలంగాణలో కేసీఆర్, అసదుద్దీన్‌లకు మోడీ సాయం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసాను అమలు చేస్తామన్నారు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ ‌లో జరిగిన విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గుర్తుచేశారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే.. సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 

కౌలు రైతులకు కూడా రైతుభరోసా అమలు చేస్తామని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి వచ్చాయని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు జరుగుతున్నాయని రాహుల్ అభివర్ణించారు. దొరల తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆయన దుయ్యబట్టారు. భూములు, ఇసుక, మద్యం ద్వారా దోపిడీ సొమ్మంతా కేసీఆర్‌కు చేరిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Latest Videos

పేదల భూములు లాక్కునేందుకే దొరల సర్కార్ ధరణి తెచ్చిందని.. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ . 3 లక్షల కమీషన్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డు తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చట్టంగా మారుస్తామని.. అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కును ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం లాక్కున్న భూములు మళ్లీ పేదలకే అప్పగిస్తామని ..కేసీఆర్ దోచుకున్న ప్రజల సొమ్మును వసూలు చేసి ప్రజలకే ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం మధ్య ఒప్పందం వందని ఆయన పేర్కొన్నారు. మోడీకి కేసీఆర్, అసదుద్దీన్ మంచి మిత్రులని రాహుల్ ఆరోపించారు. మోడీకి ఢిల్లీలో కేసీఆర్, అసదుద్దీన్‌లు సహాయం చేస్తారని.. తెలంగాణలో కేసీఆర్, అసదుద్దీన్‌లకు మోడీ సాయం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని.. ఎంపీల క్వార్టర్స్ నుంచి తనను ఖాళీ చేయించారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. అవినీతిపరుడైన కేసీఆర్ జోలికి మాత్రం మోడీ వెళ్లరని.. కేసీఆర్ అవినీతిపై మోడీ విచారణ జరిపించగలారా అని ఆయన సవాల్ విసిరారు.

కేసీఆర్‌ను  సీఎం పదవి నుంచి మోడీ దించగలరా .. తెలంగాణలో 3 నెలల్లోనే బీజేపీ గాలి పూర్తిగా పోయిందని రాహుల్ దుయ్యబట్టారు. బీజేపీ గాలి ఒక్కసారిగా పోవడంతో మోడీ అయోమయంలో పడ్డారని.. బీజేపీ, ఎంఐఎం మధ్య కూడా లోపాయికారీ ఒప్పందం వుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టేందుకే కొన్ని చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. మోడీ చెప్పిన చోటనే ఎంఐఎం తన అభ్యర్ధులను పోటీలో ఉంచుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

click me!