ఇక క్లౌడ్, కృత్రిమ మేథలదే ఫ్యూచర్.. సత్య నాదెళ్ల సంచలనం

By narsimha lodeFirst Published Feb 26, 2020, 2:54 PM IST
Highlights

టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉండాలని, అందుకోసం డెవలపర్లు నైతిక విలువలు, విశ్వాస నిర్మాణంపై దృష్టి సారించాలని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు


బెంగళూరు: టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉండాలని, అందుకోసం డెవలపర్లు నైతిక విలువలు, విశ్వాస నిర్మాణంపై దృష్టి సారించాలని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అలాగే డెవలపర్లు భిన్నత్వం గల టీమ్‌లతో కలిసి పని చేయాలని, అలా చేయడం వల్ల వారు తయారుచేసే కృత్రిమ మేథ నమూనాల్లో తెలియకుండానే ఏదో ఒక మొగ్గు లేకుండా నివారించుకోవచ్చునన్నారు.

టెక్నాలజీ సర్వవ్యాప్తమవుతున్నదని, ప్రజల జీవితాల్లోకి చొచ్చుకు పోతున్నదని, దానికి తోడు కొంత బాధ్యతను కూడా మన మీద పెట్టిందని ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సదస్సులో సత్య నాదెళ్ల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్‌ గణాంకాల ప్రకారం భారత్‌లో 42 లక్షల మంది డెవలపర్లు ఉన్నారు. రానున్న కాలంలో అలాంటి మేథస్సు ఉన్న వారికి ఏకైక గమ్యంగా మారనుంది.

ఏదైనా యాప్‌ రూపొందించుకునే ప్రతీ ఒక్క బ్యాంకు విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కస్టమర్ల డేటా పరిరక్షించాలని సత్య నాదెళ్ల సూచించారు. మీ టీమ్‌లు ఎంత విభిన్నత చూపిస్తున్నాయి, వారు రూపొందించే టెక్నాలజీలు ఏ స్థాయిలో లింగవైవిధ్యం, ప్రాంతీయ వైవిధ్యం పరిగణనలోకి తీసుకున్నాయి అన్నది ప్రధానమని ఆయన చెప్పారు.  

అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన అభివద్ధి సాధ్యమవుతుందని సత్య నాదెళ్ల అన్నారు. కొత్త టెక్నాలజీతో దేశంలోని అత్యంత సంక్లిష్ట సాంఘిక, పర్యావరణ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించగలదని అన్నారు. మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీలో నవీన టెక్నాలజీ వినియోగం ద్వారా దేశమంతటా వ్యాపార సంస్థలు, సముదాయాల మధ్య ఎలా విజయాల కథలు సష్టిస్తున్నదో తెలియజేసే ఒక లఘు చిత్రాన్ని ఆయన ఇక్కడ ప్రదర్శించారు.

Also read:దటీజ్ మారుతి: కొత్త విటారా బ్రెజా ఆవిష్కరణ.. ధర రూ.7.34 లక్షలే!!

అత్యాధునిక టెక్నాలజీతో ఇండియన్‌ బిజినెస్‌, స్టార్టప్‌ ఇన్నొవేషన్‌ లీడర్లుగా రూపొందుతున్నాయని సత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్‌ మిషన్‌ ట్రాన్సఫర్మేషనల్‌ చెక్‌ ఇన్టెన్సిటీ ద్వారా సంస్థలు తమ ప్రారంభ అభివద్ధి సాధించేందుకుకు సహాయపడుతుందన్నారు. దీని ద్వారా సంస్థలు అతివేగంగా అత్యున్నత శ్రేణి టెక్నాలజీని స్వీకరించి, తమ స్వతంత్ర డిజిటల్‌ సామర్థ్యం నిర్మించుకోవడం ద్వారా నమ్మకాన్ని పెంచుకుంటున్నాయన్నారు. 

ఆర్థిక పురోభివద్ధిని సాధించి, అది ప్రతి చోట కనిపిస్తూ, నమ్మకం కలిగిస్తూ, సుస్థిరంగా ఉండేలా టెక్నాలజీని వినియోగించుకునేందుకు మునుపెన్నడూ లేని గొప్ప సదవకాశం ఉందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దేశం మొత్తం మీద ప్రతి పరిశ్రమలోని ప్రముఖులకు వారి సొంత డిజిటల్‌ సామర్థ్యం నిర్మించుకునేలా సహాయం అందజేసి, వారు తమ సంస్థలను తీర్చిదిద్దుకునేలా మైక్రోసాఫ్ట్‌ సహకరించి, ఈ కొత్త శకంలో వారు మరింత ఎక్కువ సాధించేలా తమ సంస్థ భాగస్వామ్యమై సహకరిస్తుందన్నారు.

click me!