
డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికీ డేటా కీలకం. మనం ఇంటర్నెట్లో వెతికే సమాచారం, యాప్ల ద్వారా వాడే సేవలు, క్లౌడ్లో నిల్వ చేసే ఫోటోలు, వీడియోలు, ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ–కామర్స్ లావాదేవీలు, కృత్రిమ మేధస్సు (AI) లాంటి సాంకేతిక వినియోగం మొత్తం డేటా సెంటర్ల మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి కేవలం టెక్నాలజీ అభివృద్ధికి మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా పెద్ద సవాళ్లు విసురుతున్నాయి.
తాజా గూగుల్ నివేదిక ప్రకారం, పునరుత్పాదక శక్తి వనరులపై భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, డేటా సెంటర్ల ద్వారా ఉత్పత్తి అయ్యే కార్బన్ ఉద్గారాలు (CO2 emissions) వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు – డేటా వినియోగం పెరగడం, AI ప్రాసెసింగ్ విస్తరించడం, సరఫరా శృంఖల ఉద్గారాలు (supply chain emissions), అలాగే తక్కువ జీవితకాలం గల హార్డ్వేర్ వాడకం.
2024లో ఐక్యరాజ్యసమితి (UN) విడుదల చేసిన నివేదికలో, ప్రపంచవ్యాప్తంగా ఇ–వేస్ట్ ఉత్పత్తి, రీసైక్లింగ్ కంటే ఐదు రెట్లు వేగంగా పెరుగుతోందని హెచ్చరించారు. దీనిలో డేటా సెంటర్లు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.
డేటా సెంటర్ అనేది డేటా నిల్వ, ప్రాసెసింగ్, నెట్వర్క్ నిర్వహణ వంటి సేవలను అందించే ప్రత్యేక సదుపాయం. వీటిలో సర్వర్లు, స్టోరేజ్ పరికరాలు, నెట్వర్క్ స్విచ్లు, పవర్ యూనిట్లు, కూలింగ్ సిస్టమ్స్ వంటివి ఉంటాయి. వీటి ప్రధాన పని డిజిటల్ సేవలకి అవసరమైన డేటాను భద్రపరచడం, నిర్వహించడం, వినియోగదారులకు వేగంగా అందించడం.
* ప్రైవేట్ డేటా సెంటర్లు – కంపెనీలు తమ స్వంతంగా ఏర్పాటు చేసుకున్నవి.
* కో–లోకేటెడ్ డేటా సెంటర్లు – పెద్ద డేటా సెంటర్లలో స్థలం అద్దెకు తీసుకుని వినియోగించేవి.
* క్లౌడ్ డేటా సెంటర్లు – అమెజాన్ (AWS), మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ వంటి పెద్ద సంస్థలు నిర్వహించే హైపర్స్కేల్ సెంటర్లు.
భారతదేశంలో డేటా సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి.?
భారతదేశం ప్రస్తుతం ఆసియాలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్ మార్కెట్గా గుర్తింపు పొందుతోంది.
* ముంబై – దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్. సముద్రపు కేబుల్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండటం ప్రధాన కారణం.
* హైదరాబాద్ – టెక్ కంపెనీల విస్తరణ వల్ల డేటా సెంటర్లకు కొత్త కేంద్రంగా ఎదుగుతోంది.
* బెంగళూరు – ఐటీ హబ్ కావడంతో డేటా స్టోరేజ్ అవసరాలు అధికం.
* ఢిల్లీ–ఎన్సీఆర్ – ప్రభుత్వ, ప్రైవేట్ రంగ అవసరాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
* చెన్నై – సముద్రపు కేబుల్స్, కనెక్టివిటీ కారణంగా ముఖ్యమైన డేటా సెంటర్ నగరంగా అవతరిస్తోంది.
* తాజాగా విశాఖలో గూగుల్ రూ. 50 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
* సర్వర్లు – డేటాను నిల్వ చేసి, ప్రాసెస్ చేస్తాయి.
* స్టోరేజ్ యూనిట్లు – క్లౌడ్ లేదా యాప్లలో ఉపయోగించే ఫైల్స్ని భద్రపరుస్తాయి.
* నెట్వర్క్ పరికరాలు – డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడతాయి.
* కూలింగ్ సిస్టమ్స్ – సర్వర్లు 24×7 పని చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రత వస్తుంది. దాన్ని నియంత్రించడానికి ప్రత్యేక కూలింగ్ వ్యవస్థలు అవసరపడుతాయి.
* పవర్ సప్లై – నిరంతర విద్యుత్ సరఫరా కోసం డేటా సెంటర్లు పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగిస్తాయి.
డేటా సెంటర్ల పర్యావరణంపై ప్రభావం
డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి అనేక రకాల నష్టాలు కలుగుతున్నాయి. వీటిలో ప్రధానమైనవి.
సర్వర్లు, కూలింగ్ సిస్టమ్స్ 24 గంటలు పనిచేయడం వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. 2030 నాటికి ప్రపంచ డేటా సెంటర్ల కార్బన్ ఉద్గారాలు, అమెరికా దేశం వార్షిక ఉద్గారాల 40% సమానంగా ఉంటాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక చెబుతోంది.
హార్డ్వేర్ జీవితకాలం తక్కువగా ఉండటం వల్ల ప్రతి 3–5 ఏళ్లకోసారి మారుస్తున్నారు. ఈ ప్రక్రియలో భారీగా ఇ–వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. సరిగా రీసైకిల్ చేయకపోతే పర్యావరణానికి హానికరం.
చాలాచోట్ల ఇంకా బొగ్గు, పెట్రోలు వంటి ఇంధనాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ వాడుతున్నారు. దీని వలన కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు పెరుగుతున్నాయి.
కూలింగ్ సిస్టమ్స్లో భారీ స్థాయిలో నీరు వాడుతున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్య. (ఉదాహరణ: అమెరికాలోని అరిజోనా రాష్ట్రం).
డేటా సెంటర్ల నుంచి నిరంతరం వెచ్చని గాలి బయటకు వెళ్ళడం వల్ల స్థానిక వాతావరణం మారిపోతుంది. కొన్నిసార్లు ఇది మంచిగా కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణ: స్టాక్హోమ్లో డేటా సెంటర్ల వేడి వాయువును ఇళ్లలో తాపన కోసం వాడుతున్నారు.
పాత సర్వర్లు, ప్రాసెసర్లు సరిగా డంప్ చేయకపోతే లెడ్, మెర్క్యూరీ, క్యాడ్మియం వంటి విషపదార్థాలు నేలలో కలుస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఇ–వేస్ట్ను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలించడం గతంలో సాధారణం. దీనిని బాసెల్ కన్వెన్షన్ ఆపే ప్రయత్నం చేసింది.
2030 నాటికి డేటా సెంటర్లు 2.5 బిలియన్ మెట్రిక్ టన్నుల CO2 ఉద్గారాలు సృష్టిస్తాయని అంచనా. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రకారం, డేటా సెంటర్ల శక్తి వినియోగం వచ్చే సంవత్సరాల్లో 80% పెరుగుతుంది. అయితే, పెద్ద టెక్ కంపెనీలు పునరుత్పాదక శక్తి, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, జీరో ఇ–వేస్ట్ ల్యాండ్ఫిల్ లక్ష్యాల వైపు కదులుతున్నాయి.
* సౌరశక్తి, గాలి శక్తి వాడడం ద్వారా కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.
* విద్యుత్ సరఫరాదారుల గ్రీన్ ఎనర్జీ పాలసీలను పరిశీలించాలి.
* రిన్యూవబుల్ ఎనర్జీ క్రెడిట్స్ కొనుగోలు చేయవచ్చు.
సాంప్రదాయ ఎయిర్ కండిషనింగ్ బదులు లిక్విడ్ ఇమర్షన్ కూలింగ్, డైరెక్ట్–టు–చిప్ కూలింగ్ పద్ధతులను వాడాలి. వీటితో నీటి వృథా తగ్గుతుంది, శీతలీకరణ సమర్థత పెరుగుతుంది.
వర్చువలైజేషన్
ఒకే సర్వర్లో అనేక వర్చువల్ మిషన్లను నడిపి విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు.
పరికరాల జీవితం పెంచడం
హార్డ్వేర్ను తరచుగా మార్చడం కాకుండా, అప్గ్రేడ్లు చేసి ఎక్కువ కాలం వినియోగించాలి.
ఇ–వేస్ట్ రీసైక్లింగ్
డేటా సెంటర్ పరికరాలను సరిగా రీసైకిల్ చేసి, మళ్లీ వినియోగించే విధానాలను పాటించాలి.
గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్
కొత్తగా నిర్మించే డేటా సెంటర్లలో పర్యావరణానుకూల నిర్మాణ సామగ్రిని ఉపయోగించాలి.
స్థానిక వనరుల వినియోగం
డేటా సెంటర్లు ఏర్పాటు చేసే ప్రదేశం వాతావరణానికి అనుగుణంగా డిజైన్ చేయాలి. ఉదాహరణకు – చల్లని ప్రాంతాల్లో కూలింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది.
డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణానికి నష్టాలు ఉన్నాయనడంలో ఎంత నిజం ఉందో సరిగ్గా వ్యవహరిస్తే అంతకంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి.
ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
ప్రత్యక్ష ఉద్యోగాలు – డేటా సెంటర్లో సర్వర్ నిర్వహణ, నెట్వర్క్ ఇంజినీరింగ్, డేటా సెక్యూరిటీ, కూలింగ్ టెక్నీషియన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి.
పరోక్ష ఉద్యోగాలు – డేటా సెంటర్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, కేటరింగ్, సెక్యూరిటీ సర్వీసులు, క్లీనింగ్ సిబ్బంది వంటి రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ – డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ స్థాయిలో కరెంట్, నీరు, ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. దీని వల్ల ఆ ప్రాంతంలోని మౌలిక వసతులు మెరుగుపడతాయి.
సప్లై చైన్ – డేటా సెంటర్ నిర్మాణానికి సిమెంట్, ఇనుము, ఎలక్ట్రికల్ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, జెనరేటర్లు వంటి వాటి సరఫరా అవసరం. ఇవన్నీ స్థానిక వ్యాపారులకు కొత్త అవకాశాలు ఇస్తాయి.
సర్వీస్ రంగం – టెక్ సపోర్ట్, హార్డ్వేర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు వంటి ఐటీ ఆధారిత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
పెట్టుబడుల ఆకర్షణ
ఒకసారి డేటా సెంటర్ ఏర్పడితే, దాని చుట్టూ మరిన్ని టెక్ కంపెనీలు స్థిరపడతాయి. మల్టీనేషనల్ కంపెనీలు డేటా నిల్వ కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం వల్ల విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా లాభపడుతుంది, ఎందుకంటే డేటా సెంటర్ సిబ్బంది కోసం నివాసాలు, కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరుగుతుంది.
స్థానిక కంపెనీలు క్లౌడ్ సర్వీసులు, డేటా స్టోరేజ్ను సులభంగా పొందగలుగుతాయి. ఫిన్టెక్, ఈ–కామర్స్, హెల్త్ టెక్, ఎడ్యుకేషన్ టెక్ వంటి రంగాలు వేగంగా ఎదుగుతాయి. స్టార్టప్లకు డిజిటల్ మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి.
డేటా సెంటర్ ద్వారా పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, విద్యుత్ బిల్లులు వంటివి ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా మారతాయి. ఆదాయం పెరగడంతో అభివృద్ధి పనులకు నిధులుమెరుగవుతాయి.
డేటా సెంటర్ వల్ల స్థానిక యువతకు డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ మేనేజ్మెంట్ వంటి కొత్త టెక్నాలజీల్లో శిక్షణ లభిస్తుంది. స్థానిక కళాశాలలు, ట్రైనింగ్ సెంటర్లు డేటా సెంటర్కు అనుగుణంగా కోర్సులు రూపొందిస్తాయి.
పెద్ద డేటా సెంటర్ ఏర్పడితే, ఆ ప్రాంతం గ్లోబల్ మ్యాప్లోకి వస్తుంది. ఉదాహరణకు, ముంబై – ఆసియా డేటా సెంటర్ హబ్గా ఎదిగింది. అలాగే హైదరాబాద్ ఇప్పుడు వేగంగా డేటా సెంటర్ డెస్టినేషన్ అవుతోంది.