సమస్యలలో చిక్కుకున్న టెలికం రంగం...

By Sandra Ashok KumarFirst Published Jan 21, 2020, 11:20 AM IST
Highlights

ఏజీఆర్ చెల్లింపులపై సుప్రీంకోర్టు ఆదేశం.. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు టెల్కోలకు గుదిబండగా మారాయి. చెల్లింపులపై సర్కార్ తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించాలని కేంద్రాన్ని టెల్కోలు కోరుతున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీన ప్రకటించే బడ్జెట్ ప్రతిపాదనల్లో తమకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాయి.
 

న్యూఢిల్లీ: ఇప్పటికే సమస్యలతో సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగంపై లేవీలు తగ్గించాలని, ఆర్థికపరమైన రాయితీలు కల్పించి భారం తగ్గించాలని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. టెలికం ఆపరేటర్లు చెల్లించే పూర్తిస్థాయి చార్జీలను తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖకు సూచించింది. ప్రధానంగా లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీలు తగ్గించాలని అభ్యర్థించింది. 

2016 అక్టోబర్ నెలలో టెలికం సంస్థలు పొందిన స్పెక్ట్రం వినియోగం మీద సర్వీస్ టాక్స్‌పై లెవీ వసూళ్లపై ప్రత్యేకించి వన్ టైం స్పెక్ట్రం చార్జీలపైనా స్పష్టతనివ్వాలని ఇక్రా కోరుతోంది. పాతకాలం నుంచి పన్ను విధింపు అంశాలపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది. జీఎస్టీ ఇన్ పుట్ క్రెడిట్ డ్యూస్ విడుదల చేయాలని, మొబైల్ సిమ్ డిస్ట్రిబ్యూటర్లపై విత్ హోల్డింగ్ టాక్స్ లెవీపై రాయితీ కావాలని టెలికం రంగ పరిశ్రమ కోరుతున్నది. 

also read ఇండియాకి మరో గిఫ్ట్ ఇచ్చిన అమెజాన్ సి‌ఈ‌ఓ...

4జీ, 5జీ పరికరాలపై టీడీఎస్ (టాక్స్ ఆన్ డైరెక్ట్ సోర్స్), ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని టెలికం పరిశ్రమ సుదీర్ఘ కాలంగా కోరుతోంది. మరోవైపు ధరల ఒత్తిడిని ఎదుర్కొంటున్న టెలికం రంగం గతేడాది మార్చి నాటికి రూ.5 లక్షల కోట్ల రుణ భారాన్ని ఎదుర్కొంటున్నదని సమాచారం. 

ఏజీఆర్ చెల్లింపులపై సమీక్షా పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడంతో టెలికం ప్రొవైడర్లకు కష్టాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ ఇన్నోవేషన్, దేశీయ ఉత్పాదకతను పెంపొందించే పథకాలను తేవాలని కోరుతున్నది. నష్టాలు, రుణ భార సమస్యలు ఎదుర్కొంటున్న వొడాఫోన్‌ ప్రభుత్వం సహకరించకపోతే.. కార్యకలాపాల నిలిపివేత(దివాళా) పరిస్థితులు తలెత్తవచ్చంటూ ఇటీవల అసంతప్తిని వ్యక్తం చేసిన విషయం విదితమే. 

ఎజిఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు వేసిన రివ్యూ పిటిషన్‌ను గత శుక్రవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో రూ. 1.47 లక్షల కోట్లమేర ఎజిఆర్‌ బకాయిలను టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. వీటిలో లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ చార్జీలు, జరిమానాలు, వడ్డీ తదితరాలు కలసి ఉన్నాయి.

ఈ నెల 23 కల్లా 15 టెలికం కంపెనీలు ఎజిఆర్‌ బకాయిలను చెల్లించవలసి ఉంది. ఎజిఆర్‌ బకాయిల చెల్లింపులపై టెలికం కంపెనీలకు కొంతమేర ఉపశమనాన్ని కల్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచించినట్లు సమాచారం. ఎకో సిస్టమ్ వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నది.

also read హువావే చీఫ్ ఆఫీసర్ విడుదలపై సంచలన తీర్పు...

గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై కేంద్రీకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని టెలికం రంగం కోరుతున్నది. ఇదిలా ఉంటే పలు బ్యాంకులకు టెలికం కంపెనీలు భారీగా రుణ బకాయిలు పడ్డాయి. ఒత్తిడిలో ఉన్న టెలికం కంపెనీలకు కేంద్రం సాయం అందించాలని ఆర్బీఐ సూచించినట్లు సమాచారం. 

ప్రధానంగా వొడాఫోన్‌ ఐడియా రూ.53వేల కోట్ల మేర సవరించిన స్థూల ఆదాయ (ఎజిఆర్‌) బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మొండిబకాయిల సమస్యను దష్టిలో పెట్టుకుని ఆర్బీఐ.. ఎజిఆర్‌ బకాయిల చెల్లింపులపై తాత్కాలిక నిలిపివేతను ప్రకటించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌ చివరికల్లా టెలికం రంగం బ్యాంకులకు చెల్లించవలసిన రుణాలు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయని అంచనా.
 

click me!