హెచ్చరికలు జారీ చేసిన ఐసీసీ అవినీతి నిరోదక విభాగం
పాకిస్థానీ క్రికెటర్లకు ఐసీసీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పలువురు ప్లేయర్లు యాపిల్ వాచ్ ధరించడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. మైదానంలో ఇలాంటివి ధరించడం నిషేధమని, వీటి వల్ల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే అవకాశం ఉందని ఐసీసీ అధికారులు తెలిపారు. ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలని పాక్ మేనేజ్ మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.
నిన్న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మొదలైన టెస్ట్ మ్యాచ్ లో పలువురు పాకిస్థానీ ఆటగాళ్లు స్మార్ట్ వాచ్ లు ధరించడాన్ని ఐసీసీ అధికారులు గుర్తించారు. వీటిని ఇంటర్నెట్ కు అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వీటిని ధరించి ఆడటంతో బుకీలు ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే పాక్ ఆటగాళ్లను ఐసీసీ హెచ్చరించింది.
ఆటగాళ్లు మైదానానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది వీరి వద్ద ఉండే ఫోన్లను, ఎలక్ట్రానికి వస్తువులను తీసుకుంటారు. అయితే పాక్ ఆటగాళ్లకు స్మార్ట్ వాచ్ లు ధరించడాన్ని ఎలా అనుమతించారని గ్రౌండ్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఇకపై ఆ వాచీలను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.