తొలి వన్డే: భారత్ చేతిలో కివీస్ చిత్తు

By sivanagaprasad KodatiFirst Published Jan 23, 2019, 7:29 AM IST
Highlights

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు.

లంచ్ బ్రేక్ తర్వాత ఓపెనర్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం వెలుతురులేమితో అంపైర్లు కాసేపు ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత అంపైర్లు భారత లక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులకు నిర్దేశించారు. కోహ్లీతో జతకలిసిన శిఖర్ ధావన్ రెచ్చిపోయాడు. వరుస బౌండరీలతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కోహ్లీ కూడా కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో భారత్ విజయానికి చేరువైంది. ఈ దశలో 45 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు. అనంతరం రాయుడుతో కలిసి శిఖర్ ధావన్ కేవలం 34.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ధావన్ 75, రాయుడు 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో ఫెర్గుసన్, బ్రేస్‌వెల్‌లు తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన తర్వాత శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించిన కోహ్లీ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫెర్గుసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విజయానికి కేవలం 17 పరుగుల దూరంలో భారత్ ఉంది.

న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అర్థ సెంచరీ చేశాడు. భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది.

న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 24 బంతుల్లో 11 పరుగులు చేసి బ్రేస్ వెల్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ కు జత కూడాడు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత ఆట ప్రారంభమైంది.

న్యూజిలాండ్ 157 పరుగులకు అలౌటైంది. భారత స్పిన్ మాయాజాలాన్ని ఎదుర్కోలేక 38 ఓవర్లలో 157 పరుగులకు అలౌటై భారత్‌ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ విలియమ్సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, షమీ 3, చాహల్ 2, జాదవ్ 1 వికెట్ పడగొట్టారు. 

న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. కుల్‌దీప్ బౌలింగ్ ఫెర్గుసన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్ 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. 

రెండు పరుగుల తేడాతో న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడిన అతను అర్థసెంచరీ సాధించిన కెప్టెన్ విలియమ్సన్‌‌ను కుల్‌దీప్ యాదవ్ బోల్తాకొట్టించాడు. ఆ తర్వాత రెండో బంతికే బ్రేస్‌వెల్‌ను అతను ఔట్ చేశాడు. 

నేపియర్ వన్డేలో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ఉన్నంత సేపు మైదానంలో మోత మోగించిన మిచెల్ సాన్‌ట్నర్ 14 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం కివీస్ 31 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 

నేపియర్ వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌ అర్థసెంచరీ సాధథించారు. రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఒడ్డుకు చేర్చేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ అర్థసెంచరీ సాధించాడు. 64 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది అతనికి వన్డేల్లో 36వ అర్థసెంచరీ.

న్యూజిలాండ్ స్వల్పో వ్యవధిలో మరో వికెట్ కోల్పోయింది. జాదవ్ బౌలింగ్‌లో హెన్రీ నికోలస్ 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ విలియమ్సన్ సంయమనంతో ఆడుతున్నప్పటికీ అతనికి సహకరించేవారు లేరు. దీంతో న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 

న్యూజిలాండ్ 4వ వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. కెప్టెన్ విలియమ్సన్ , హెన్రీ నికోలస్ క్రీజులో ఉన్నారు. 

కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాస్ టేలర్ ‌పెవిలియన్ చేరాడు. 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ కలిసి ముందుకు నడిపారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడగొట్టేందుకు చాహాల్ రంగప్రవేశం చేయడంతో స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డ టేలర్ అతనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 34 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

న్యూజిలాండ్ స్వల్ప వ్యవధిలో రెండో వికెట్‌ను కోల్పోయింది. రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపులో ఉన్న ఓపెనర్ మున్రోను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 5 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో విధ్వంసకర ఆటగాడు మార్టిన్ గప్టిల్‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం మున్రో, కెప్టెన్ విలియమ్సన్ క్రీజులో ఉన్నారు. 

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్‌లో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన వెంటన్ కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత్.. న్యూజిలాండ్‌పైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఐతే కివీస్ జట్టు కూడా బలంగానే ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 

click me!