
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరిగిన ఐదో వన్డేలో హార్దిక్ పాండ్యా ఓ చిన్న తప్పు చేసి పరుగును కోల్పోయాడు. నీషమ్ వేసిన 49వ ఓవర్ నాలుగో బంతికి రెండు పరుగులు తీశాడు. అయితే, తొలి పరుగును వేగంగా పూర్తి చేసే క్రమంలో క్రీజుపై బ్యాటు పెట్టకముందే అది కాస్తా జారిపోయింది.
క్రీజుకు బ్యాట్ తాకలేదనే విషయాన్ని గమనించని పాండ్యా రెండో పరుగు తీశాడు. దీంతో ఆ బంతికి రెండు పరుగులొచ్చాయి. అయితే పాండ్యా తొలి పరుగును పూర్తి చేయకుండానే రెండు పరుగు తీసినట్టు గుర్తించిన కివీస్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఆ విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు.
రిప్లేలో పాండ్యా బ్యాటు క్రీజును తాకలేదని తేలింది. జారిపోతున్న బ్యాటును క్రీజుపైకి విసిరేసి రెండో పరుగు కోసం ప్రయత్నించినట్టు రిప్లేలో కనిపించింది. దీంతో అంపైర్ ఓ పరుగు తగ్గించి ఓ పరుగును మాత్రమే ఇచ్చాడు.