ఫిఫా వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి బాయ్‌కాట్ దెబ్బ... సోషల్ మీడియాలో ట్రెండింగ్, ఖాళీగా కనిపిస్తున్న స్టేడియాలు..

By Chinthakindhi RamuFirst Published Nov 22, 2022, 3:28 PM IST
Highlights

ఫిఫా వరల్డ్ కప్‌ 2022 కోసం 7 కొత్త స్టేడియాలను నిర్మించిన ఖతర్! స్టేడియాల నిర్మాణం కోసం 6500లకు పైగా వలస కూలీల దుర్మరణం.. బాయ్‌కాట్ చేయాలంటూ ‘#BoycottQatar2022’హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్...

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఖతర్‌లో ఘనంగా ప్రారంభమైంది. 32 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ 28 రోజుల పాటు ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించనుంది. అయితే ఈ వరల్డ్ కప్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ ‘#BoycottQatar2022’హ్యాష్‌ట్యాగ్‌ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఈ హ్యాష్ ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుండడం విశేషం...

ఇంతకీ ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌ 2022ని బాయ్‌కాట్ చేయాలని నెటిజన్లు ఎందుకు ఇంతలా డిమాండ్ చేస్తున్నారు.. దీనికి వెనుకున్న కారణం ఏంటి? 

అరబ్బుల దేశం ఖతర్‌లోని 5 నగరాల్లో 8 వేదికల్లో ఫిఫా వరల్డ్ కప్ 2022 నిర్వహిస్తున్నారు. ఇందులో  7 స్టేడియాలు పూర్తిగా కొత్తవి. వరల్డ్ కప్ హక్కులు పొందిన తర్వాత ఫిఫా కోసమే 7 స్టేడియాలను నిర్మించింది ఖతర్. వీటి నిర్మాణం కోసం 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ఖతర్. (భారతీయ కరెన్సీలో 83 కోట్ల రూపాయలకు పైగా)...

ఈ స్టేడియాల నిర్మాణ కోసం పనిచేసిన వారంతా వివిధ దేశాల నుంచి పొట్టి కూటి కోసం ఖతర్‌కి వచ్చినవాళ్లే. ఈ స్టేడియాల నిర్మాణం సమయంలో దాదాపు 6500 వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మంది భారతీయులే కావడం మరో విశేషం...

భారత్ నుంచి 2711 మంది, నేపాల్ నుంచి 1641 మంది, బంగ్లాదేశ్ నుంచి 1018, పాకిస్తాన్ నుంచి 824, శ్రీలంక నుంచి 557 మంది... మిగిలిన వాళ్లు వివిధ దేశాల నుంచి వలస కార్మికులు పొట్టి కూటి కోసం ఖతర్‌కి వెళ్లి, అక్కడ ప్రాణాలు కోల్పోయారు. 

అనుకున్న సమయానికి స్టేడియానికి సిద్ధం చేసుందుకు కార్మికులతో అహర్నిశలు పని చేయించింది ఖతర్ ప్రభుత్వం. 55 డిగ్రీల మండుటెండలో సరైన రక్షణ లేకుండా పని చేసిన కూలీలు... దయనీయ స్థితిలో దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిని స్వదేశానికి పంపడం కూడా వృథా ఖర్చుగా భావించిన ఖతర్ అధికారులు, అక్కడే స్టేడియాల కింద పాతిపెట్టి ఉంటారని సమాచారం...

సమాధుల మీద నిర్మించిన స్టేడియంలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌ 2022 టోర్నీని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇప్పటికే 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో చాలా వరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఖతర్‌లో ఉన్న కఠినమైన ఆంక్షలతో పాటు ఈ బాయ్ డిమాండ్ కూడా ప్రేక్షకులు స్టేడియాలకు రాకపోవడానికి కారణంగా చెబుతున్నారు...

స్టేడియానికి వచ్చినవాళ్లు కూడా ‘బాయ్‌కాట్ ఫిఫా వరల్డ్ కప్’ ఫ్లకార్డులు ప్రదర్శిస్తుండడం మరో విశేషం..

click me!