వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసింది.. సచిన్ కాదట.. ఆందోళనలో టెండూల్కర్ అభిమానులు

First Published Jul 21, 2018, 12:50 PM IST
Highlights

వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించింది ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా సచిన్ టెండూల్కర్ అని క్రికెట్ గురించి కొంచెం టచ్ ఉన్న వాళ్లెవరైనా చెబుతారు

వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించింది ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా సచిన్ టెండూల్కర్ అని క్రికెట్ గురించి కొంచెం టచ్ ఉన్న వాళ్లెవరైనా చెబుతారు.. 2010లో ఇండోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఫీట్‌ను సాధించాలని అప్పట్లో చాలా మంది క్రికెటర్లు ప్రయత్నించారు. కానీ ఎవరికీ ఈ ఫీట్ సాధ్యం కాలేదు.

ఈ మ్యాచ్‌లో 147 బంతులను ఎదుర్కొన్న మాస్టర్ 25 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సచిన్ ఘనతతో ఆయన అభిమానులు ఉప్పొంగిపోయారు. ఈ తర్వాత ఎంతోమంది డబుల్ సెంచరీలు చేసినా మొదటిది మాత్రం సచినే అని సంబంరపడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న ఒక వార్త వారి ఆనందాన్ని దూరం చేసింది..

సచిన్ కంటే ముందే వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ రికార్డయ్యిందట.. అది కూడా 20 ఏళ్ల క్రిందటే.. చేసింది ఒక మహిళా క్రికెటర్. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెలిండా క్లార్క్ 1997 మహిళా ప్రపంచకప్‌లో భాగంగా డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో బెలిండా 229 పరుగులు చేశారు.. 155 బంతుల్లో 22 ఫోర్లతో ఆమె ఈ ఘనత సాధించారు. అది ఓవరాల్‌గా వన్డేల్లో నమోదైన తొలి డబుల్ సెంచరీగా... మహిళల విభాగంలో తొలి ద్విశతకంగా ఐసీసీ గుర్తించింది.

వీరిద్దరి తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, మార్టిన్ గప్టిల్, ఫకార్ జమాన్‌లు డబుల్ సెంచరీలు సాధించారు. వీరిలో రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకాన్ని సాధించాడు.. 

click me!