
Jan Aushadhi store: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ యువతకు ఉపాధి అందించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపడుతాయి. పేదలకు, చిన్న కుటుంబాలకు ఆరోగ్య రక్షణను అందుతుంది, ప్రజల్లో ఆరోగ్య అవగాహన వంటి ముఖ్య లక్ష్యాలు కూడా నేరవేరుతాయి. ఇంతకీ ఆ నిర్ణయమేంటీ అని భావిస్తున్నారా? సీఎం చంద్రబాబు ప్లాన్ ఏంటీ? అని ఆలోచిస్తున్నారా?
ఏపీ సీఎం చంద్రబాబు బీసీ యువతకు జన ఔషధి స్టోర్లను ఇవ్వాలని కీలకంగా నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన పెద్దఎత్తున దరఖాస్తులను పరిశీలించి, వాటిని త్వరితగతిన అమలు చేయమని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా, రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు తక్కువ ధరలో generic ఔషధాలు అందడం మాత్రమే కాక, బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తరించడానికి మార్గం సుగమం అవుతుంది.
అధికారుల ప్రకారం, ఈ చర్య రాష్ట్రంలోని వైద్య సేవల శ్రేణిని బలోపేతం చేస్తూ ఆరోగ్య సదుపాయాల సమీకరణకు తోడ్పడుతుంది. సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం, ప్రభుత్వం ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఈ చర్య, పేదల వైద్య భారం తగ్గించడం, సమగ్రమైన ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని అధికారులు చెప్పారు.
వైద్య రంగంపై సీఎం సమీక్ష
ఇదిలా ఉంటే.. సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, ఆరోగ్య బీమా విధానాలను విస్తరించడం, కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం, ఉచిత వైద్య పరీక్షలు అందించడం, యోగా-నేచురోపతి అభివృద్ధి వంటి అంశాలపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో అధికారులు తీసుకోవలసిన పలు ముఖ్య సూచనలను సీఎం ఇచ్చారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రస్తుతం 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతున్న వైద్య బీమాను 1.63 కోట్ల కుటుంబాలకు విస్తరించాలని సూచించారు. దీని వల్ల సుమారు 5.02 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు:
అలాగే.. సమీక్ష సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాకు 2.24 పడకలు ఉన్నప్పటికీ, WHO ప్రమాణాల ప్రకారం 3 పడకలు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందువలన, మరిన్ని 12,756 పడకలను అందుబాటులోకి తీసుకురావాల్సిన సూచన చేశారు.
ఆరోగ్య రథాలు:
కుప్పం నియోజకవర్గంలో 45 రోజుల్లో ఉచిత వైద్య పరీక్షల పైలెట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 'ఆరోగ్య రథం' ద్వారా మొబైల్ వైద్య సేవలు అందించేందుకు సూచనలు ఇవ్వబడ్డాయి. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని త్వరలో అమలులోకి తేవాలని సూచించారు.
మోడల్ ఇన్క్లూజివ్ సిటీ:
పెర్కిన్స్ ఇండియా, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో అమరావతిలో 'మోడల్ ఇన్క్లూజివ్ సిటీ' ఏర్పాటుకు ప్రతినిధులు సీఎంనకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర విద్య, సమాన హక్కులు, అందరికీ అందుబాటులో మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా ఉంటుంది. బారియర్-ఫ్రీ పబ్లిక్ ప్లేస్, ఇన్క్లూజివ్ రోడ్ డిజైన్, అందరికీ అందుబాటులోని ప్రజా రవాణా, డిజిటల్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్ ప్రోగ్రామ్స్, ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని ప్రతిపాదించారు.