రంగు రంగుల హోలీ... ఆనందాల హేళి..!

By telugu news teamFirst Published Mar 27, 2021, 12:51 PM IST
Highlights

శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

27 మార్చి 2021 శనివారం రోజు రాత్రి కామధహానం జరుగుతుంది, 28 ఆదివారం రోజు హోలీ 'రంగుల పండగ' జరుపుకుంటారు. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం.

హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం. 

భారతదేశ ప్రవాసులు:- కాలచక్రంలో సంవత్సరాలు గడుస్తున్నకొద్ది ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, ఐరోపా, దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు. కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికి ఎంతో ఉత్సాహం. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. 

ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజ్రుంభన జరుగుతుంది. కెమికల్స్ లేని రంగులతో  ...మన  పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం, వీలైనంత వరకు కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే అందరికీ మంచిది. ఈ పండగ అంటే అందిరికీ ఆనందమే కానీ స్వయం కృతాపరాధం వలన ఇబ్బందులు కొని తెచ్చుకుని మనవాళ్ళకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పుకోదగిన సూచన, మనం ఆరోగ్యంగా ఉంటే రోజు పండగనే... జై శ్రీ మన్నారాయణ.   

click me!