varalakshmi Vratham:పీరియడ్స్ సమయంలో 'వరలక్ష్మీ వ్రతం' వస్తే ఏం చేయాలి?

By telugu news teamFirst Published Aug 11, 2022, 10:05 AM IST
Highlights

వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే... సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం.

శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నోచే నోము 'వరలక్ష్మీ వ్రతం'. ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున పెళ్లయిన మహిళలు ఈ వ్రతం ఆచరిస్తే భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్షు బాగుంటాయని ఓ విశ్వాసం.  అయితే ఒక్కోసారి అనుకోని అవాంతరాలు వస్తాయి. కొందరు మహిళలకు పీరియడ్స్ (menstruation period) సమయంలో ఈ వ్రతం వస్తుంది. అప్పుడు నెక్ట్స్ అంటే తదుపరి శుక్రవారం ఈ పూజను జరుపుకోవచ్చు. అప్పుడూ ఇబ్బంది ఎదురైతే నవరాత్రులలో ఓ శుక్రవారం ఈ వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చని శాస్త్రం చెప్తోంది. అవే శుభాలు,లాభాలు అందుతాయని బుషి ఉవాచ.   అలాగే ఈ వ్రతం ...వివాహం అయిన స్త్రీలకు మాత్రమే అని గమనించాలి. 

వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే... సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ  వ్రతంగా పాటిస్తాం. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి.

ఈ వ్రతం వెనక ఉన్న కథేంటంటే...

జగన్మాత పార్వతీ దేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా వుందా అన్ని పరమేశ్వరున్ని అడిగటం జరిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు. దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు. పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత వుండేది. ఆమెకు కలలో అమ్మ‌వారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. 

పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబసభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది. శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానాదులు ఆచరించి తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది.వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని మన పురాణాలు ద్వారా వెల్లడి అవుతోంది.
 

click me!