
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటన ఒక బూటకమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది.ఒక ట్రాపిక్ కానిస్టేబుల్ దర్యాప్తు జరిపినా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడవుతాయని ఈ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
అసలు చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటించనవసరం లేదని చెబుతూ ఆయన ఆస్తులను ఎపుడో 13 సంవత్సరాల కిందటే తెహల్కా ప్రకటించిందని పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ శాసన సభ్యుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. తెహెల్కా లెక్కల ప్రకారం దేశంలోని అత్యంత ధనవంతులలో చంద్రబాబు నాయుడు ఒకరని ఆయన చెప్పారు.
చంద్రబాబు నాయుడి అస్తులను ఆయన కుమారుడు లోకేశ్ ప్రకటించాక , పార్టీ తరఫున స్పందిస్తూ ఇంతకంటే బూటకం మరొకటుండదని ఆయన అన్నారు.’లోకేశ్ ప్రకటించిన అస్తులకు మించిన పెద్ద జోక్ ఇంకోటి ఉంటుందా? అదొక దిగజారుడు రాజకీయమం. చంద్రబాబు అవినీతి సొమ్మును చూడటానికి ప్రజలకు రెండు కళ్లు చాలవు, ఆయన ఆస్తులు పెరిగితే ఏపీలో పేదరికం పెరిగినట్లే,’ నని కరుణాకర్ రెడ్డి అన్నారు.
సుపుత్రుడు లోకేశ్ చెప్పిన లెక్కలు నిజమయితే, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు కుటుంబం మీద జాలిపడి తలా రూ.వంద ఇచ్చి చందాలు పోగేసి ఆదుకోవసిందేనని అయన అన్నారు.రాష్ట్రాభివృధ్ది కి చంద్రబాబు నాయుడు ఆస్తుల పెరుగుదల కొలబద్ద అని చెబుతూ, నాయుడి అస్తులు పెరిగితే, రాష్ట్రం ప్రజలు పేదవాళ్లయినట్లు, ఆయన ఆస్తులు తరిగితే, ప్రజలు బాగుపడుతున్నట్లు లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు.