కరోనాతో తెలంగాణ విలవిల: పెద్ద దిక్కులు అందుబాటులో లేక...

By Sirisha SFirst Published Apr 23, 2021, 12:52 PM IST
Highlights

కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ కొరోనాబారిన పడ్డారు. 15 రోజులు తనను కలవొద్దని ఆరోగ్యశాఖామంత్రి ఈటల తెలిపారు.

తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ లేక, మందులు లేక ఇలా ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోజువారీ కేసులు 6000 దాటాయి నేడు. ఇది రానున్న రోజుల్లో మరింతగా పెరిగిపోవచ్చు. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ పెట్టడం వల్ల ఒకింత ప్రజల మూమెంట్ అనేది తగ్గినప్పటికీ... ఆ ఒక్క చర్య మాత్రమే సరిపోయేలా కనబడడం లేదు. 

రాష్ట్రంలోని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇంటివద్ద ట్రీట్మెంట్ పొందుతున్న కొందరు పేషెంట్లకు ఆక్సిజన్ అందడం లేదు. ట్విట్టర్ నిండా ఆక్సిజన్ కి సంబంధించిన రిక్వెస్ట్లే కనబడుతున్నాయి. కోవిడ్ పేషెంట్ల సంఖ్యా పెరిగిపోతుండడంతో మామూలుగా ఆక్సిజన్ అవసరమయ్యే ఇతర రోగులకు సైతం ఆక్సిజన్ దొరకడం కష్టంగా మారింది. రాష్ట్రంలోని చాలా మంది ప్రైవేట్ ఆక్సిజన్ సప్లై దారులు కాల్స్ కూడా ఎత్తడంలేదు. డిమాండ్ కి సరిపడా ఆక్సిజన్ తమవద్ద లేదని వారు వాపోతున్నారు. 

ఆసుపత్రుల్లోని బెడ్స్ పరిస్థితే వేరు. గాంధీలో ఇప్పటికే బెడ్లు నిండుకున్నాయి. ఐసీయూ బెడ్లు లేవు. సాధారణ బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉన్నట్టు కోవిడ్ డాష్ బోర్డులో చూబెడుతున్నప్పటికీ... బెడ్స్ ఆసుపత్రి వారు మాత్రం పేషెంట్స్ ని చేర్చుకోవడంలేదు. కారణం ఆక్సిజన్ కొరత. మాట్లాడిన ఇద్దరు ముగ్గురు ఆసుపత్రివారు కూడా ఇదే మాట చెప్పారు. 

కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ కొరోనాబారిన పడ్డారు. 15 రోజులు తనను కలవొద్దని ఆరోగ్యశాఖామంత్రి ఈటల తెలిపారు. అసలే కరోనా వైరస్ ని చూసి భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు ఇప్పుడు ఒక పెద్ద దిక్కనేది కనబడకుండా అయిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ చూపిన చొరవ, నేనున్నాను అంటూ ఆయన ఇచ్చిన అభయం అందరికీ గుర్తే. 

ప్రస్తుతం ఆయనే రెస్ట్ తీసుకుంటూ కోలుకుంటున్నారు. కేటీఆర్, ఈటల కూడా లేకపోవడం, మరోపక్క ఆక్సిజన్ కొరత తీవ్రమవుతుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉండగా నిన్న కేటీఆర్ కేంద్రాన్ని తెలంగాణపై చూపుతున్న సవతి తల్లి ప్రేమపై నిలదీశారు. కేంద్రానికి 150 రూపాయలుగా ఉన్న ధర రాష్ట్రాలకు ఎందుకు 400 గా ఉండాలని ఆయన ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ టాక్స్ అన్నప్పుడు వన్ నేషన్ వన్ పరిచే ఎందుకు ఉండొద్దు అని ఆయన అడిగిన విషయం తెలిసిందే. 

దీనితో సోషల్ మీడియాలో నేటి ఉదయం నుండి #KTRStopFakingStartWorking అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది. కేంద్రాన్ని ఆడిపోసుకోకుండా ముందు పనిచేయడం నేర్చుకోండంటూ కొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్న ప్రస్తుతం దేశంతో పాటు రాష్ట్రం పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. ఆక్సిజన్ అత్యవసరంగా తెప్పించడం కోసం విమానాల ద్వారా ఒడిశా నుండి తీసుకురానున్నారు. ఆ ఆక్సిజన్ వస్తే కానీ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో పనిచేయలేవు. 

click me!