టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

First Published Dec 31, 2017, 2:10 PM IST
Highlights
  • టీడీపీ నేతల్లో ఎన్నికల భయం రోజురోజుకీ పెరిగిపోతోంది.
  • 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. టికెట్ తమకు ఇస్తారో లేదో అనే టెన్షన్ పట్టుకుంది.

టీడీపీ నేతల్లో ఎన్నికల భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. టికెట్ తమకు ఇస్తారో లేదో అనే టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్ ని కప్పిపుచ్చుకునేందుకు మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో కొందరు ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఆ ఎమ్మెల్యేల పేర్లు మాత్రం  బయటపెట్టలేదు.  ఆ ఎమ్మెల్యేలతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానని కూడా చెప్పారు. అయితే.. ఆ జాబితాలో ఎమ్మిగనూరు నియోజకవర్గం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పనితీరు సరిగా లేదని.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం ఊపందుకుంది.

కాగా.. దీనిపై ఎమ్మెల్యే స్పందించాడు. ‘ఎమ్మిగనూరు నియోజకవర్గం నాదే... నాకు టిక్కెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు...’ అని స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొందరు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘ఎమ్మిగనూరు నాకు కన్న తల్లి లాంటిది... ఎమ్మిగనూరు నుంచే పోటీ చేస్తా’ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులతో టిక్కెట్ తనకే వస్తుందన్నారు. ఇందులో ఎటువంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదని  ఎమ్మెల్యే పేర్కొన్నారు.

click me!