చంద్రబాబు మీద ఏడుకొండల వాడికి ఫిర్యాదు చేయనున్న రోజా

First Published Nov 27, 2017, 12:26 PM IST
Highlights

గాలేరు-నగరి కాల్వ నిర్మాణం జాప్యం మీద  నిరసనగా తిరుమలకు పాదయాత్ర

ఆంధ్రా ‘పొలిటికల్ ఫైర్ బ్రాండ్’ ఎమ్మెల్యే ఆర్ కె రోజా కూడా పాదయాత్రకు సిద్ధమయ్యారు.తెలుగుదేశం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు  ప్రతిపక్ష వైసిసి నాయకులు  పాదయాత్రను ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు.  అసెంబ్లీలోనో, ప్రెస్ కాన్ఫరెన్స్  లకో పరిమితమయి పోవడం కన్నా జనంలోకి వెళ్లడమే మేలని భావిస్తున్నారు. అందుకే తమ వాదన నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు  ప్రతిపక్ష శాసన భ్యులు పాదయాత్రలకు దిగుతున్నారు. ఇపుడు వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో 19 రోజులుగా కడప, కర్నూలు జిల్లాలలో నడుస్తున్నారు. అంతకు ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ‘మన ఎమ్మెల్యే మన ఇంటికి’ అంటూ వినూత్న పాదయాత్ర ప్రారంభించారు.ఆయన 105 రోజులు ఈ యాత్ర చేస్తారు. ప్రజలమధ్యేగడుపుతారు. ఇంటికి కూడా వెళ్లరు.

ఈ మధ్య నరసరావుపేట ఎమ్మెల్యే  డాక్టర్ గోపిరెడ్డి శ్రీయనివాసరెడ్డి తన వూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించారు. 150 మంది అనుచరులతో ఆయన రోజుకు 30 కిమీ దూరం నడుస్తూ  13 రోజులలో  తిరుమల చేరుకున్నారు. 2019 ఎన్నికల్లోతమ పార్టీ గెలవాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆయన పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్  పార్టీ చంద్రగిరి శాసనసభ్యుడు డాక్టర్ చెవిరెడీ భాస్కరరెడ్డి కూడా తిరుమల యాత్ర జరిపారు.  తమ నేత జగన్ పాదయాత్ర విజవంతం కావాలనికోరుతూ ఆయన తిరుమల  పాదయాత్ర నిర్వహించారు..

ఇపుడు  నగరి ఎమ్మేల్యే రోజా కూడా  పాదయాత్ర చేపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రధాన నీటి ప్రాజెక్టైన గాలేరు-నగిరి నిర్మాణాన్ని  ప్రభుత్వం  జాప్యం చేస్తున్నదని ఆమె విమర్శిస్తున్నారు. ఈ జాప్యానికి నిరసన తెలుపుతూ  ప్రాజక్టు సాధనయాత్ర కు పూనుకుంటున్నారు. ఆమె నగిరి సత్రవాడ నుండి తన అనుచరులతో పాదయాత్ర ప్రారంబిస్తారు. దారి పొడవునా ఆమె ప్రజలను కలుపుకుంటూ, మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫ్యలాలను విడమర్చి చెబుతూంటారు.  ఇలా డిసెంబర్ రెండవ తేదిన తిరుమల చేరుకొని చంద్రబాబు మీద  శ్రీవారికి  వినతి పత్రం సమర్పిస్తారు. దీనితో యాత్ర ముగస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

మంగళవారం ఉదయం 8.30 గంటలకు నగరిలో సత్రవాడ నుంచి యాత్ర ప్రారంభించి డిసెంబర్ 2వ తేదీ తిరుమల గుడిలో దర్శనంతో పాదయాత్ర ముగిస్తామని  రోజా ఈ రోజు తిరుమలలో చెప్పారు. ఆమె ఈ రోజు తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గాలేరు-నగరి తమ నియోజకవర్గంలోని ఐదు మండలాలకి తాగునీరు, సాగు నీరు అందించే ప్రాజెక్టు అని, ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు తెలిపారు.
 

 

click me!