
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెత్త తరలింపును అడ్డుకున్న కేసులో చెవిరెడ్డితోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులకు పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చిత్తూరు జిల్లా సి. రామాపురంలోని డంప్ యార్డును తొలగించాలని ధర్నా చేస్తున్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.
చెవిరెడ్డి నిరవధిక నిరసన తో ఆప్రాంతలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సి.రామాపురం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గత మూడు రోజులుగా రామాపురంలోని డంప్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులతో కలిసి చెవిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి, నిరవధిక నిరసన తెలుపుతున్నారు.
శుక్రవారం పోలీసులు చెవిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు 50మంది వైఎస్ఆర్‑సీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు.