
చంద్రబాబూ.. మీరు నిప్పయితే, ఇక ఎంతమాత్రం జాప్యం చేయకుండా పదవికి రాజీనామా చేయండి, అని వైసిపి నాయకుడు బోత్ససత్యనారాయణ సలహా ఇచ్చారు..
తెలంగాణ ప్రభుత్వం వోటుకు నోటు కేసులో అదనపు చార్జ్ షీట్ ఎసిబి కోర్టులో దాఖలు చేసినందున ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం భావ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఓటుకు కోట్లు కేసులో మొదటి ఛార్జిషీట్లో 26 సార్లు, రెండో ఛార్జిషీట్లో 22 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు ఉంది. దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. మీరు నిప్పా లేక తుప్పా’ అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.
చార్జ్ షీట్ నేపథ్యంలో బోత్సా ఈ రోజు విలేకరులతో మాట్లాడారు.
ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే చంద్రబాబు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.
‘ఛార్జిషీట్ దాఖలైనపుడు దేశంలో ఎక్కడా ఎపుడూ ఏ ముఖ్యమంత్రి కూడా పదవిలో కొనసాగలేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజీనామా మీద తక్షణం నిర్ణయం తీసుకుండి.’ అని అంటూ ‘ఓటుకు నోటు కేసు తెరపైకి రాగానే మీరు హైదరాబాద్ను వదలి విజయవాడకు పారిపోలేదా,’ అని బొత్స అన్నారు.
ఇదే స్ఫూర్తితో ఇపుడు చార్జ్ షీట్ వేసిన వెంటనే రాజీనామా చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు లాలూచీపడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన వాటాపై చంద్రబాబు ఎలా లాలూచీ పడ్డారో ప్రజలు అర్థం చేసుకోగలరని , ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని కూడా బోత్స ఆరోపించారు.