NEWS
చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి నుంచి మరో అదిరిపోయే ఫోన్ రానుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ... వినియోగదారులను ఆకర్షించిన షియోమి తాజాగా గేమింగ్ ఫోన్ ని విడుదల చేయనుంది. ప్రస్తుత కాలంలో గేమింగ్ స్మార్ట్ ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. షియోమి ఈ నిర్ణయం తీసుకుంది.
బ్లాక్ షార్క్ టెక్నాలజీ కంపెనీ లో షియోమి కొంత కాలం క్రితం వాటాను కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు ఈ కంపెనీ బ్లాక్ షార్క్ బ్రాండ్ పేరిట బ్లాక్ షార్క్ ఎస్కేఆర్-ఏ0 అనే కోడ్ నేమ్ తో గేమింగ్ స్మార్ట్ ఫోన్ ని తయారు చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు కూడా ఇటీవలే లీకయ్యాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉండనున్నట్లు సమాచారం.
సహజంగా స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కటం, దాంతో ప్రాసెసర్ దానంతట అదే తక్కువ స్పీడుతో పనిచేస్తూ ఫోన్ పనితీరు తగ్గి పోవడం జరుగుతుంటుంది. అయితే షియోమి తీసుకొస్తున్న ఈ గేమింగ్ ఫోన్లో ఏవియేషన్ గ్రేడ్ కూలింగ్ ఏర్పాటు చేశారు. ఇది అటు సీపీయూనీ, ఇటు జీపీయూనీ ఎప్పటికప్పుడు చల్లపరుస్తూ ఉంటుంది. దీంతో ఫోన్ వెడెక్కడం లాంటి సమస్య ఉండదు అలాగే ఫోన్ ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉంటుంది. ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ఆగస్టు నాటికి భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.