NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఎన్నో అపచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆలయంలోని వెండి వాకిలి లోపలి భాగంలో , యోగ నరసింహస్వామి ఆలయానికి ఆగ్నేయం వైపు ఇనుప మెట్ల నిర్మాణాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీని పై రమణ దీక్షితులు స్పష్టత ఇచ్చారు. ఇనుప మెట్ల నిర్మాణం ఆగమశాస్త్రానికి విరుద్ధం కాదన్నారు.అయినా తిరుమలలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తున్నారని, మహాలఘు దర్శనం వద్దని చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆయన వాపోయారు. అలాగే పవిత్రోత్సవాల్లో విమాన గోపురంపైకి పండితులు కాకుండా మిగతా వారు ఎక్కడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమన్నారు. తిరుమలకు భక్తుల రాక పతాకస్థాయికి చేరిందని, యుగధర్మం పాటించకపోతే కాలజ్ఞానం ప్రకారం ఆలయం వందేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని దీక్షితులు అన్నారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వివరించానన్నారు.