NEWS
నల్లగొండ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనులకోసం కూలీలను తీసుకెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలు చనిపోగా మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ప్రస్తుతం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోను కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని పీఏపల్లి మండలం ఒద్దిపట్ల గ్రామంలో ఉదయం కూలీలను తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. వ్యవసాయ పనుల కోసం తీసుకెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో మొత్తం 30 మంది కూలీలు ఉన్నారు. వీరంతా ట్రాక్టర్ లోంచి నేరుగా కాలువలో పడ్డారు. అయితే కాలువలో నీటి ఉదృతి అదికంగా ఉండటంతో ఇందులో కొట్టుకుపోయి 10 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని పలువురిని రక్షించారు. అలాగే పోలీసులకు సమాచారం అందడంతో వారుకూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
మృతుల వివరాలు
చనిపోయిన వారు రమావత్ సోన (70), రమావత్ జీజా (65), జరుకుల ద్వాలి (30), రమావత్ కెలి (50), రమావత్ కంసలి (50), బానవత్ బేరి (55), రమావత్ భారతి (35), రమావత్ సునీత(30), రమావత్ లక్ష్మి లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.