NEWS
వాహనదారులకు గుడ్ న్యూస్
వాహనదారులకు ఇది నిజంగా శుభవార్తే. ఇక నుంచి టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. అంటే.. ఇక టోల్ ప్లాజా వద్ద డబ్బులు కట్టాల్సిన పనిలేదా అని సంబరపడకండి. డబ్బులు కట్టాలి.. కానీ.. అక్కడ ఆగకుండానే కట్టొచ్చు.జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఆగి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ల నుంచే డబ్బు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిసార్లు రద్దీ ఎక్కువగా ఉంటే వాహనాలు ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రీపెయిడ్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా ఖాతాల నుంచే డబ్బుచెల్లించే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. వాహనం టోల్ప్లాజా దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా వారి ఖాతాల నుంచి డబ్బు కట్ అయ్యే విధానం తీసుకువస్తున్నారు.
భారత జాతీయ ప్రధాన రహదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ) ఈ విధానానికి సంబంధించిన ఐదు ఆవిష్కరణలను ఎంపిక చేసింది. వీటిని అయిదు ప్రాంతాల్లో దిల్లీ-ముంబయి, దిల్లీ-చండీగఢ్, దిల్లీ-కోల్కతా, బెంగళూరు-చెన్నై స్ట్రెచ్లలో పరీక్షిస్తున్నట్లు సమాచారం. టోల్ ప్లాజాల వద్ద డబ్బు చెల్లించేందుకు ఆగకుండా నేరుగా ఖాతాలో నుంచి కట్టగలిగేలా అన్ని ఆప్షన్లతో కూడిన మొబైల్ అప్లికేషన్ను ఎన్హెచ్ఏఐ మరికొన్ని నెలల్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి వాహానానికి సంబంధించిన వివరాలు అందులో పొందుపరచాల్సి ఉంటుంది. టోల్ ప్లాజా సమీపించగానే వైఫై, బ్లూటూత్ సహాయంతో ఫోన్లోని యాప్ దాన్ని డిటెక్ట్ చేస్తుంది. ప్లాజాలోని సిస్టమ్ వాహనాన్ని గుర్తించి టోల్ డబ్బును యాప్తో అనుసంధానం చేసిన ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది.